అయ్యప్ప స్వామి దీక్ష అంటే కేవలం మాల ధరించడం మాత్రమే కాదు.. అది కఠినమైన నియమ నిబంధనలతో కూడిన ఒక పవిత్ర జీవన విధానం. బ్రహ్మచర్యం, సత్యం, పవిత్రత వంటి కట్టుబాట్లతో పాటు.. దీక్షా సమయంలో మద్యం-మాంసాహారం నిషేధం అనేది అత్యంత ముఖ్యమైన నియమం. ఈ సమయంలో భక్తులు తమ మనసు, శరీరం, ఆలోచనలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంచుకోవాలి.
హుజూర్ నగర్ ఘటన..
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ పట్టణంలో జరిగిన ఒక ఘటన అయ్యప్ప భక్తులను , సాధారణ ప్రజలను షాక్కు గురి చేసింది. అయ్యప్ప మాలను ధరించిన ఒక వ్యక్తి బీర్ తాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీక్షలో ఉన్నప్పుడు మద్యం సేవించడం అనేది నియమాలకు పూర్తిగా విరుద్ధం. శబరిమల యాత్ర కోసం భక్తులు ఎంతో కఠోర దీక్ష చేస్తారు. అలాంటి కట్టుబాట్లను ఉల్లంఘించిన ఆ వ్యక్తిపై సహ భక్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేమి పాడు పని? అంటూ ప్రశ్నిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వీడియో వైరల్ అయిన తరువాత సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు నియమ నిబంధనలు పాటించని అతడు తక్షణమే మాల తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కొందరు ఈ విధంగా స్పందించారు. ఆ వ్యక్తి చేసింది తప్పు అయినప్పటికీ, అతని తప్పును వీడియో తీసి బహిరంగంగా అవమానించడం సరికాదు. వీడియోను తొలగించండి అని కొందరు సూచిస్తున్నారు. ‘అయ్యప్ప భక్తులుగా, మనం ఒకరి తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి కానీ.. బహిరంగ నిందలు వేయకూడదు’ అని మరో భక్తుడు అభిప్రాయపడ్డాడు.
ఈ మొత్తం ఘటన అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మిక యాత్ర ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేస్తోంది. బాహ్య ఆచారాల కంటే.. మనసు, ఆలోచనలలో పవిత్రతను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టం చేసింది. అయినప్పటికీ.. అయ్యప్ప స్వామి పట్ల భక్తులలో ఉన్న నమ్మకం, భక్తి ఏమాత్రం తగ్గలేదని నెటిజన్ల కామెంట్లు సూచిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa