కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులకు అవమానాలు, వేధింపులు పెరుగుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకత్వం మహిళా అధికారులను, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను అగౌరవపరుస్తోందని మండిపడ్డారు. మంత్రులు మహిళా అధికారులను తమ ఇళ్లకు పిలిపించుకొని సమీక్షలు చేస్తున్నారనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయని, దీంతో మహిళా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్ శాంతి కుమారికి ఉన్నత గౌరవం దక్కిందని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మహిళా అధికారులను పలు విధాలుగా వేధిస్తోందని ఆరోపించారు.
మహిళా అధికారులపై వస్తున్న ఆరోపణలను ఖండించకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. మంత్రుల ఇంటి సమీక్షల వ్యవహారంపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలంటే తన తల్లి భయపడుతున్నారని ఒక మహిళా మంత్రి కుమార్తె చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కొత్తగూడెంలో గిరిజన మహిళను వివస్త్ర చేసిన ఘటన, మహిళా జర్నలిస్టులపై దాడులు, కేసులు వంటి సంఘటనలు రాష్ట్రంలో మహిళల భద్రతకు అద్దం పడుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తే 'ఇందిరమ్మ రాజ్యం' వస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారని గుర్తు చేసిన సునీతా లక్ష్మారెడ్డి, మహిళలను అవమానించడమే 'ఇందిరమ్మ రాజ్యమా?' అని సూటిగా ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ నివాసంలో ఒక మహిళా అధికారిణిని కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించిన ఘటనను ఆమె ప్రస్తావించారు. మహిళలకు కోటీశ్వరులను చేసే కార్యక్రమాలు చేపట్టకపోయినా ఫరవాలేదు కానీ, కనీసం వారి హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని ఆమె హితవు పలికారు.
చివరగా, రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థినులు వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని సునీతా లక్ష్మారెడ్డి నిలదీశారు. మహిళల ఆత్మగౌరవాన్ని, హక్కులను పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె దుయ్యబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa