ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మరో టూరిజం హబ్.. ఆ జిల్లాకు మహర్దశ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 07:59 PM

తెలంగాణను పర్యాటకానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాలుగా కృషి చేస్తోంది. చార్మిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలతో పాటు కట్టిపడేసే ప్రకృతి అందాలను ఆస్వాధించేలా పర్యటక రంగానికి సరికొత్త సొబగులు అద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణలో ఆయా ప్రాంతాలను టూరిజం హబ్‌‌లుగా తీర్చిదిద్దుతూ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. నిర్మల్ జిల్లాకు కూడా రాష్ట్ర పర్యాటక పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించనున్నారు. చారిత్రక వైభవం ఉట్టిపడే కోటలు, బురుజులు, కనువిందు చేసే సహజ సిద్ధమైన జలపాతాలు, అద్భుతమైన వన్యప్రాణులతో కూడిన అభయారణ్యాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి దృఢ సంకల్పం వ్యక్తం చేశారు.


పటేల్ రమేశ్ రెడ్డి స్వయంగా నిర్మల్‌లోని చారిత్రాత్మక బంగల్‌పేట చెరువు నడిబొడ్డున కొలువై ఉన్న బురుజును, శతాబ్దాల చరిత్రను తనలో నింపుకున్న శ్యామ్‌గడ్ కోటను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అర్జుమంద్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాల చారిత్రక ప్రాధాన్యతను, అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఆయన అధికారులతో చర్చించారు.


 అనంతరం మీడియాతో మాట్లాడిన పటేల్ రమేశ్ రెడ్డి.. నిర్మల్ జిల్లా ఒక అద్భుతమైన చారిత్రక, సహజ సంపదలకు నిలయమని కొనియాడారు. శిథిలావస్థలో ఉన్న కోటలు, బురుజులకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా విద్యాక్షేత్రంలో ప్రసిద్ధి గాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి ప్రకృతి అందాలకు నెలవైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వరకు ఒక ప్రత్యేకమైన టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు.


ఈ పర్యాటక కారిడార్‌లో జీవనాధారమైన గోదావరి నదిపై నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు యొక్క అందాలు, ఆహ్లాదకరమైన కడెం ప్రాజెక్టు యొక్క ప్రశాంతత, ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న కుంటాల జలపాతం యొక్క మనోహర దృశ్యాలు, పచ్చని అడవుల మధ్య నుంచి జాలువారే పొచ్చెర జలపాతం యొక్క స్వచ్ఛమైన అందాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టూరిజం రంగం అభివృద్ధి చెందితే స్థానికంగా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. తద్వారా ఈ ప్రాంతం ఆర్థికంగా బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, నిర్మల్ జిల్లాను రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందేలా కృషి చేస్తామని పటేల్ రమేశ్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa