ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూర్తిగా మహిళలతో నిర్వహించబడే పెట్రోల్ బంకులు,,,రేవంత్ సర్కార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:07 PM

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మహిళలతో పూర్తిగా నిర్వహించబడే పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో ఐదు నియోజకవర్గాల్లో ఈ బంకులు ప్రారంభం కానున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ పాసైన వారికి పెట్రోల్, డీజిల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తుండగా.. డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టుల్లో నియమించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో ఈ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించి, వారే స్వయంగా వాటిని నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశలో సంగారెడ్డి జిల్లాలోని ఐదు ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం వేగంగా కార్యాచరణను ప్రారంభించింది.


సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 18,756 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉండగా.. వాటిలో 1,90,381 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి పథకానికి మహిళల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులు కొత్త ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలనే వారి ఆకాంక్షకు ఈ పథకం ఒక బలమైన వేదికను అందిస్తోంది.


జిల్లాలో ప్రారంభించనున్న ఈ ప్రత్యేక మహిళా పెట్రోల్ బంకులను ముందుగా ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, పటాన్‌చెరు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు. పైలట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత వెలుగు కార్యాలయ ప్రాంగణంలో 8 గుంటల ప్రభుత్వ స్థలంలో మొదటి పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెట్రోల్ పంపు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెలాఖరున దీనిని ప్రారంభించి పూర్తిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.


ఈ పెట్రోల్ బంకులను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బంకు ఏర్పాటుకు సుమారు రూ. 2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు ఐఓసీఎల్‌తో 20 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. మిగిలిన నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం 8 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు సంబంధిత అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు పక్కన రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. చుట్టుపక్కల మరో పెట్రోల్ బంకు లేని ప్రదేశాలను ఎంపిక చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాగానే ఐఓసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.


జిల్లాలో ఏర్పాటు చేయనున్న ప్రతి మహిళా పెట్రోల్ బంకులో 15 నుంచి 20 మంది మహిళలు షిఫ్ట్ పద్ధతిలో పనిచేయనున్నారు. ఈ బంకుల నిర్వహణ పూర్తిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతుంది. పెట్రోల్ బంకుల్లో పనిచేసేందుకు సమాఖ్య సభ్యులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం కనీసం 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి.. పదో తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పాసైన మహిళలను ఎంపిక చేస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ పాసైన వారికి పెట్రోల్, డీజిల్ నింపడం, క్యాషియర్ బాధ్యతలు అప్పగిస్తుండగా.. డిగ్రీ పూర్తి చేసిన మహిళలను మేనేజర్ పోస్టుల్లో నియమించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడటమే కాకుండా.. సమాజంలో వారి స్థానం మరింత మెరుగుపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa