లగచర్ల, హకీంపేట భూసేకరణ విషయంలో రేవంత్ సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. భూసేకరణపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూసేకరణ చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూసేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది.
కాగా, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో భూసేకరణకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పారిశ్రామికవాడ ఏర్పాటకు మొత్తం 1177.35 ఎకరాలు సేకరించనుండగా గతంలోనే భూముల సేకరణకు ప్రజాభిప్రాయం చేపట్టారు. హకీంపేటలో మొత్తం 187 మంది రైతుల దగ్గర నుంచి భూ సేకరణ చేపట్టగా.. పట్టా భూములున్న రైతులు మాత్రం భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులు మాత్రం అంగీకారాన్ని తెలిపారు.
ఇక భూసేకరణకు వ్యతిరేకంగా లగచర్లలో అధికారులపై దాడి జరిగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నారంటూ కొందరు రైతులు అధికారులపై దాడి చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా.. ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా.. పలువురు రైతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత తాము అక్కడ ఫార్మా కంపెనీ పట్టడం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కూడా రైతులు సహకరించటం లేదు.
భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.17 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు, డీటీసీపీతో కూడిన ఇంటి స్థలం, అర్హతను బట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. తమకు వ్యవసాయం చేయటం మాత్రమే వచ్చునని.. కోట్ల రూపాయల విలువైన భూములను ఎలా ఇస్తామని నిలదీశారు. ఆ తర్వాత కొందరు రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా న్యాయస్థానం స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa