|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:48 PM
పశ్చిమాసియాలో యుద్ధం 16వ రోజుకు చేరుకున్న వేళ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్న్ నెతన్యాహును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆదివారం సంచలన ప్రకటన చేసింది. "పిల్లలను పొట్టనబెట్టుకుంటున్న ఆ నేరగాడు (నెతన్యాహు) ఒకవేళ ఇంకా బతికే ఉంటే.. అతడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా శక్తినంతా ఉపయోగించి అతడిని వేటాడి మరీ చంపి తీరుతాం" అని ఐఆర్జీసీ హెచ్చరించింది.
ఒకవైపు ఇరాన్ చంపేస్తామని హెచ్చరిస్తుంటే.. మరోవైపు అసలు నెతన్యాహు ఎక్కడున్నారనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మార్చి 12వ తేదీన నెతన్యాహు విడుదల చేసిన ఒక వీడియో ఈ అనుమానాలకు ఆజ్యం పోసింది. ముఖ్యంగా ఈ వీడియోలో నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడంతో.. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన నకిలీ వీడియో అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అమెరికన్ రాజకీయ విశ్లేషకురాలు క్యాండేస్ ఓవెన్స్ సైతం "బిబీ ఎక్కడ? ఆయన కార్యాలయం ఎందుకు ఇలాంటి ఫేక్ వీడియోలను రిలీజ్ చేస్తూ.. డిలీట్ చేస్తోంది?" అని చెప్పారు. ఈక్రమంలోనే నెతన్యాహు చనిపోయాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. "అవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రధాని పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు" అని స్పష్టం చేసింది. అయితే నెతన్యాహు నేరుగా మీడియా ముందుకు రాకపోవడంతో ఈ పుకార్లకు ఇంకా పుల్స్టాప్ పడలేదు. ఈక్రమంలోనే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా నెతన్యాహును ఉద్దేశించి మాట్లాడుతూ.. పిల్లలను చంపిన ఓ నేరగాడు ఇంకా బతికే ఉంటే అతడిని మేమే చంపేస్తాం అంటూ ఇరాన్ హెచ్చరించింది. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అతడు ఎక్కడున్నా వెంటాడి వేటాడి మరీ చంపుతామని పేర్కొంది. బతికే ఉన్నాడో లేడో అని ఇరాన్ వ్యాఖ్యానించడంతో.. ఇజ్రాయెల్ ప్రధాని మృతి, బహిరంగంగా కనిపించకపోవడం పట్ల అనుమానాలు ఎక్కువవుతున్నాయి.
Latest News