|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 07:49 PM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఆయనపై హత్యాయత్నం జరిగిందని, నెతన్యాహు మరణించారంటూ వైరల్ అవుతున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. "అవన్నీ పచ్చి అబద్ధాలు.. ప్రధాని క్షేమంగా ఉన్నారు. తన విధుల్లో బిజీగా ఉన్నారు" అని అధికారికంగా ప్రకటించింది.
అసలెందుకు ఆయన చనిపోయారంటూ వార్తలు వచ్చాయి?
నెతన్యాహు మరణ వార్తలు ఇంతలా వైరల్ కావడానికి ఆయన షేర్ చేసిన ఒక వీడియోనే ప్రధాన కారణం. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరుపుతున్న యుద్ధం గురించి ఆయన శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 35వ సెకను వద్ద నెతన్యాహు తన కుడి చేయి ఎత్తినప్పుడు, చిటికెన వేలు పక్కన అదనంగా మరో వేలు ఉన్నట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియో అని.. నెతన్యాహు బతికి లేకపోవడం వల్లే ఇలా ఏఐ వీడియోలను వాడుతున్నారని ఆరోపించారు.
అయితే వీడియో వెనుక ఉన్న తెరలు కదులుతున్నా.. పక్కనే ఉన్న ఇజ్రాయెల్ జెండాలు మాత్రం కదలకపోవడాన్ని నెటిజన్లు ఎత్తిచూపారు. ఇది కూడా ఏఐ లూపింగ్ ఎఫెక్టే అని అమెరికన్ పొలిటికల్ కామెంటేటర్ క్యాండేస్ ఓవెన్స్ వంటి వారు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఈ వివాదంపై ఎక్స్ ప్లాట్ఫారమ్కు చెందిన 'గ్రోక్' చాట్బాట్ క్లారిటీ ఇచ్చింది. నెతన్యాహుకు ఆరు వేళ్లు లేవని, అది కేవలం ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమేనని స్పష్టం చేసింది. కెమెరా యాంగిల్, వెలుతురు, నీడల ప్రభావం వల్ల అరచేతిలోని కండరాల భాగం మరో వేలులా కనిపిస్తోందని వివరించింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఫుటేజీల్లో ఆయనకు ఐదు వేళ్లే ఉన్నాయని తేల్చిచెప్పింది. అలాగే ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. చనిపోయారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొంది.
యుద్ధం 16వ రోజుకు చేరుకున్నా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవడంతో ఇరాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. అలాగే ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సెగ తగులుతోంది. ప్రతిరోజూ సుమారు 20 మిలియన్ బారెళ్ల చమురు రవాణా నిలిచిపోయింది.
Latest News