|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 07:19 PM
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. దీంతో హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల టిఫన్ రేట్లు పెంచగా.. మరికొందరు ఎల్పీజీ గ్యాస్ వాడకం నుంచి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇంకొందరు ఏకంగా వ్యాపారాలనే మూసివేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండక్షన్ స్టవ్లకు మారిత యూనిట్కు రూ.2 రాయితీ ఇస్తామని.. హోటల్స్, టీ స్టాల్స్, క్లౌడ్ కిచెన్లకు ఆఫర్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వాడకం నుంచి ఇండక్షన్ స్టవ్లకు మారేందుకు గానూ హోటళ్లు, రెస్టారెంట్లకు ఈ ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది.
శనివారం రోజున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలల బిల్లులతో పోలిస్తే.. విద్యుత్ వినియోగం పెరిగితే హోటళ్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లకు ప్రోత్సాహకాలు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వినియోగించే ప్రతి అదనపు యూనిట్ విద్యుత్కు రూ.2 ప్రోత్సాహకాన్ని తమిళనాడు విద్యుత్ బోర్డు అందిస్తు్ందని ప్రకటించింది. ఆతిథ్య రంగంతో పాటుగా ఎంటర్ప్రెన్యూయర్లు, రైతులకు కూడా ఈ అవకాశం కల్పించింది.
అధిక సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్లు, హీటర్ల కొనుగోలు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా రాయితీలు వర్తింపజేయనున్నారు. అలాగే రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం నెలకొనటంతో వినియోగదారులు ఇండక్షన్ స్టవ్ వంటి ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారు.
గ్యాస్ కొరతతో పాటుగా గ్యాస్ ధరలతో పోలిస్తే. ఇండక్షన్ స్టవ్ కరెంట్ వినియోగం కూడా తక్కువగా ఉండటంతో వీటివైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లో ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరిగింది. కొన్నిచోట్ల నోస్టాక్ అని చెప్తున్న పరిస్థితి. గ్యాస్ కొరత కారణంగా పల్లె ప్రజలకు కట్టెలపొయ్యి ప్రత్యామ్నాయం కాగా.. పట్టణాల్లో ఇండక్షన్ స్టవ్లే దిక్కు అవుతున్నాయి.
Latest News