|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 07:26 PM
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లా కిషన్గఢ్లో కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ట్రక్కు.. జైపూర్- అజ్మీర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ట్రక్కులోని గ్యాస్ సిలిండర్లు అన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ట్రక్కు డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. ట్రక్కును, గ్యాస్ సిలిండర్లను జాతీయ రహదారిపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
మరోవైపు ట్రక్కు.. టైరు పేలిపోవటంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో 145 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అయితే ఈ ఘటనలోఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటం, గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిషన్గఢ్ సమీపంలోని ఛిడియాబౌడీ పాత టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న సమయంలో టైర్ పంక్చర్ కావటంతో ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో లారీ అదుపుతప్పి జాతీయ రహదారిపై బోల్తాపడింది.
అందులోని 145 సిలిండర్లు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణ ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు పేలతాయా అనే భయాలు నెలకొన్నాయి. అయితే సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ గ్యాస్ సిలిండర్లను బర్నా గ్రామం నుంచి కిషన్గఢ్లోని గ్యాస్ ఏజెన్సీకి తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే టోల్ ప్లాజా వద్దకు రాగానే టైర్ పేలటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు మొత్తం జాతీయ రహదారిపై పడిపోవటంతో స్థానికులు భయపడిపోయారు. అలాగే ముందుకు వెళ్లేందుకు వాహనదారులు కూడా వణికిపోయారు. దీంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మదన్ గంజ్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. క్రేన్ సాయంతో జాతీయ రహదారిపై పడిపోయిన ట్రక్కును తొలగించారు. సిలిండర్లను జాగ్రత్తగా తరలించారు. అనంతరం వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.
Latest News