|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:52 PM
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. బాబర్ ఆజమ్ లాంటి స్టార్ ప్లేయర్ను సైతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఈ సిరీస్ నుంచి తప్పించింది. యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. అయితే తొలి మ్యాచ్లోనే ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాక్ బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బంగ్లా బౌలర్లు అదరగొట్టారు. అయితే ఓ దశలో పాకిస్థాన్.. 41/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు.. ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. క్రీజులోకి అలా రావడం.. ఇలా వెళ్లడం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చివరకు 30.4 ఓవర్లలో ఆ జట్టు 114 పరుగులకు కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఫహీమ్ అష్రఫ్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నాహిద్ రాణా ఐదు వికెట్లు పడగొట్టాడు. మెహిదీ హసన్ మిరాజ్ 3, తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 1 వికెట్ తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఎప్పుడెప్పుడు మ్యాచ్ను ముగిద్దామా అన్నట్లు ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ తంజిద్ హసన్ తమిమ్.. 42 బంతుల్లో 67 రన్స్ చేసి అజేయంగా నిలిచి.. జట్టును గెలిపించాడు. దీంతో 15.1 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా 209 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి.. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Latest News