|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:09 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బుధవారం రోజున చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా.. దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉన్న ఎన్9 జంక్షన్ వద్ద బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ మంటలలో ఎల్అండ్టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదంలో భారీగా మంటలు చెలరేగటంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలముకొంది. స్థానికులు సమాచారం అందించటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఏడు ఫైరింజిన్ల సాయంతో మంటలను నియంత్రించారు.
అయితే ప్రమాదానికి కారణమైన మంటలు సమీప పొలంలో నుంచి వచ్చాయని ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. పొలం నుంచి పైపుల వరకు గడ్డి పేర్చి, పైపులకు నిప్పు పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఘటనాస్థలిని పరిశీలించింది. మరోవైపు మంటలు వ్యాపించి వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ అగ్నిప్రమాదంపై పలు సందేహాలను వారు వ్యక్తం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. మరోవైపు మంటల్లో కాలిపోయిన పైపులు.. ఏడు రకాల ఎమినిటీస్ కల్పించేందుకు ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇవన్నీ చాలా ఖరీదైనవని వివరించారు. అయితే అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హోం మంత్రి అనిత ఈ ప్రమాదం వెనుక కారణాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Latest News