|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 08:07 PM
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు మోజ్తభా ఖమేనీ అదృశ్యం అయ్యారని కొందరు, యుద్ధంలో గాయపడ్డారని మరికొందరు పుకార్లు రేపుతున్నారు. ఇంకా కొందరు అయితే ఆయన చనిపోయి ఉండొచ్చని కూడా ఊహాగానాలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇందుకు సంబంధించిన చర్చలు చేస్తుండగా.. ఇరాన్ అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఛానల్ సోమవారం ఒక ఆసక్తికర వార్తను ప్రసారం చేసింది. మోజ్తబా ఖమేనీని "జాన్బాజ్ ఆఫ్ రంజాన్" (యుద్ధంలో గాయపడిన యోధుడు) అని సంబోధించింది. అంటే ఆయన యుద్ధ సమయంలో గాయపడ్డారనే విషయాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లు అయింది. అయితే ఆ గాయం ఎలా అయింది? దాని తీవ్రత ఎంత? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన గాయపడ్డ విషయం నిజమేనని అంతా నమ్ముతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం దేశ వ్యవహారాలను నడిపించే స్థితిలో ఉన్నారా లేదా అనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
మోజ్తబా ఖమేనీ అదృశ్యంపై వస్తున్న వార్తలను అణచివేసేందుకు ఇరాన్ మీడియా వింత ప్రయత్నాలు చేస్తోంది. ఆయన కొత్త ఫోటోలు, ప్రస్తుత వీడియోలు విడుదల చేయలేక.. పాత దృశ్యాలను, ఏఐ ద్వారా సృష్టించిన కృత్రిమ చిత్రాలను వాడుతూ అంతా సాధారణంగానే ఉందని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అసలు దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారని, మోజ్తబా కేవలం ఒక బొమ్మగా మాత్రమే ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.
అలీ ఖమేనీ కుమారుడైన మోజ్తబా.. గత కొన్నేళ్లుగా తెర వెనుక ఉండి ఇరాన్ భద్రతా వ్యవహారాలను నడిపించారు. అయితే ఇప్పుడు కీలక సమయంలో ఆయన బహిరంగంగా కనిపించకపోవడం సైన్యంలో కూడా అయోమయాన్ని కలిగిస్తోంది. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే.. వారసుడిగా ఎవరిని నియమిస్తారనే చర్చ కూడా మొదలైంది. యుద్ధ సమయంలో నాయకత్వ లేమి ఇరాన్కు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది.
Latest News