|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 08:06 PM
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఖమేనీ వారసత్వాన్ని మొజ్తబా అందిపుచ్చుకోవడాన్ని ఉత్తర కొరియా అధికారికంగా సమర్థించింది. ఇరాన్ ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని ప్రకటిస్తూనే.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్యాంగ్యాంగ్ నిప్పులు చెరిగింది. పశ్చిమాసియాలో శాంతిని తుడిచి పెట్టేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఇరాన్ పాలకులను మార్చాలని, అక్కడ తమకు అనుకూలమైన వ్యవస్థను తీసుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ఉత్తర కొరియా తప్పుబట్టింది. ఒక దేశ రాజకీయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం, ఆ దేశ ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీయడం అరాచకమని ఉత్తర కొరియా విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు. ఇరాన్ సామాజిక వ్యవస్థను కూలదోసేందుకు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి పన్నుతున్న కుట్రలను ప్రపంచం తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇలాగే చైనా, రష్యాలు సైతం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నకైన మొజ్తబాకు మద్దతు ఇచ్చాయి. రెండ్రోజుల క్రితమే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాయి.
మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ షీల్డ్' సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ విన్యాసాలు కేవలం రక్షణ కోసం చేస్తున్నవి కావని, ఇవి తమపై దాడి చేసేందుకు జరుగుతున్న ముందస్తు సన్నాహాలేనని కిమ్ ఆరోపిస్తున్నారు. ఒకవేళ అమెరికా దూకుడు పెంచితే ఊహించని రీతిలో భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాము అణ్వాయుధ దేశమనే నిజాన్ని వాషింగ్టన్ అంగీకరిస్తేనే చర్చలకు తావుంటుందని కిమ్ తెగేసి చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా తాజాగా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. 'చో హ్యోన్' అనే భారీ యుద్ధ నౌక నుంచి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా తన కుమార్తె జు ఏతో కలిసి పర్యవేక్షించారు. నౌకాదళాన్ని అణ్వాయుధాలతో సన్నద్ధం చేసే ప్రక్రియలో ఇది కీలక అడుగు అని ఉత్తర కొరియా ప్రకటించింది.
Latest News