|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 08:54 PM
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం తొలి దశకు సంబంధించిన 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. ఈ ధనాధన్ లీగ్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా మ్యాచ్ల షెడ్యూల్ను వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. తొలి దశలో భాగంగా మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు మొత్తం 20 మ్యాచ్లు 10 వేదికల్లో నిర్వహించనున్నారు.ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ప్రకారం సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నాలుగు మ్యాచ్లు ఆడనుంది. ఇందులో మూడు మ్యాచ్లు ప్రత్యర్థి జట్ల వేదికల్లో జరుగుతుండగా, ఒక మ్యాచ్ మాత్రం హైదరాబాద్లో హోమ్ గ్రౌండ్లో జరగనుంది. ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మార్చి 28న జరిగే తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఎస్ఆర్హెచ్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే అక్కడ ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి తుది అనుమతి రావాల్సి ఉంది.ఆర్సీబీతో తొలి మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 2న కోల్కతా నైట్ రైడర్స్తో కోల్కతాలో తలపడనుంది. అనంతరం ఏప్రిల్ 5న హైదరాబాద్లో లక్నో సూపర్ జెయింట్స్తో హోమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. తర్వాత ఏప్రిల్ 11న న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ పోటీ పడనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.ఇక ఐపీఎల్ 2026 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ పలు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది. సలీల్ అరోరా (రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్ (రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా (రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె (రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), లియామ్ లివింగ్స్టోన్ (రూ.13 కోట్లు), శివమ్ మావి (రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు)లను జట్టులోకి తీసుకుంది.అలాగే ఫ్రాంచైజీ ఇప్పటికే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ వంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ ఆటగాళ్లతో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది.
Latest News