|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 06:10 PM
ప్రకృతి వైద్య రంగ నిపుణులు, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన నిర్ణయం గతేడాది డిసెంబర్ నెలలోనే జరిగింది. అయితే అధికారిక ఉత్తర్వులు మాత్రం సోమవారం రోజున జారీ అయ్యాయి. మంతెన సత్యనారాయణ రాజును ఏపీ ప్రభుత్వం యోగా, నేచురోపతి సలహాదారుగా నియమించింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు మంతెన సత్యనారాయణ రాజుకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. గౌరవ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరస సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజుకు వాహనం, కార్యాలయం, సిబ్బంది సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే అధికారిక పర్యటనల కోసం ట్రావెల్ అలవెన్స్ అందిస్తారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో ఈ విషయాలను స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు జి. సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ప్రకృతి వైద్యుడిగా మంతెన సత్యనారాయణ రాజుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. ఉండవల్లిలోని కరకట్ట వద్ద మంతెన సత్యనారాయణ రాజు.. ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ప్రకృతి వైద్యంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఆయనను నియమించింది. మరోవైపు మంతెన సత్యనారాయణ రాజుకు విజయవాడ సహా రెండు చోట్ల ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రకృతి వైద్యంతో మంతెన సత్యనారాయణ రాజు రోగులకు సేవలు అందిస్తున్నారు.
మరోవైపు గతంలోనూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఏపీ ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుంది. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారుగా నియమించింది. చాగంటి సహకారంతో విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. పెద్దలపై గౌరవం, సామాజంపై బాధ్యత, క్రమశిక్షణ, నైతిక విలువలను విద్యార్థులలో పెంపొందించేలా చాగంటి సహకారంతో ఈ పుస్తకాలను తయారు చేశారు. విలువల విద్య పేరుతో వీటిని రూపొందించి ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది.
Latest News