|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:25 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డార్జిలింగ్ జిల్లాలో జరిగిన అంతర్జాతీయ సంతల్ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ జరుపుకోవాల్సిన కార్యక్రమం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనటం కోసం రాష్ట్రపతి ముర్ము శనివారం రోజున పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అయితే అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు బెంగాల్ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో వేదిక మార్చాల్సి వచ్చింది. దీంతో సదస్సుకు కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ద్రౌపది ముర్మును స్వాగతించేందుకు సీఎం మమతా బెనర్జీసహా మంత్రులు కూడా రాలేదు. దీంతో రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. అలాగే సదస్సు ఏర్పాట్లపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు అంతర్జాతీయ సంతాల్ సదస్సులో మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సంతల్ కమ్యూనిటీకి చెందిన చాలా మంది సభ్యులు.. ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు. అలాగే కార్యక్రమం ఎంపిక చేసిన వేదికపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇది చాలా సిగ్గుచేటు.. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడ్డారంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. గిరిజన సమాజం నుంచి వచ్చిన ముర్ము వ్యక్తం చేసిన బాధ పౌరులలో తీవ్ర విచారాన్ని కలిగించిందని పేర్కొన్నారు. టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతంగా ఉంటుందని, దానిని ఎల్లప్పుడూ గౌరవించాలని అన్నారు.
వేదిక మార్పుతో వివాదం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదికను డార్జిలింగ్లోని బిధాన్నగర్ నుంచి సిలిగురిలోని బాగ్డోగ్రా ప్రాంతంలో ఉన్న గోస్సైన్పూర్కు మార్చిన తర్వాత వివాదం ప్రారంభమైంది. ఈ నిర్ణయం వల్ల సంతాల్ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది సభ్యులు ఈ కార్యక్రమానికి చేరుకోవడం కష్టమైందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
మరోవైప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ద్రౌపది ముర్మును ఆహ్వానించేందుకు ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన సీఎం, మంత్రులు హాజరు కాలేదు. అయితే సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విషయాన్ని సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. రాష్ట్రపతి ఒక ప్రాంతాన్ని సందర్శిస్తే.. సీఎం, మంత్రులు రావాలని అన్నారు . తాను తనను తాను బెంగాల్ ఆడబిడ్డగా భావిస్తానని, మమతా బెనర్జీని తన చెల్లెలుగా అనుకుంటానని, కానీ ముఖ్యమంత్రి తన పట్ల అసంతృప్తిగా ఉన్నారో లేదంటూ ద్రౌపది ముర్ము పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. రాష్ట్రపతి కార్యాలయం పంచుకున్న, ఆమోదించిన లైనప్ ప్రకారం రాష్ట్రపతిని స్వాగతించామని, అలాగే వీడ్కోలు పలికామని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ రాష్ట్రపతికి ఆహ్వానం పలికారన్నారు. అయితే సమావేశం నిర్వాహకులు తగినంతగా సిద్ధం కాకపోయి ఉండొచ్చని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి లోటుపాట్లు లేవన్నారు.
వివాదంపై వివరణ కోరిన కేంద్రం
మరోవైపు ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో జరిగిన లోపాలకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్.. పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రపతికి స్వాగతం పలికే విషయంలో ప్రోటోకాల్ను పాటించకపోవడం, అంతర్జాతీయ సంతాల్ సమావేశం వేదికను చివరి నిమిషంలో మార్పు చేయటం, ప్రయాణ మార్గంలో మార్పులు, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లు వంటి అనేక అంశాలపై నివేదిక కోరింది.
మరోవైపు లోపాలకు సంబంధించి స్థానిక అధికారులపై ఏదైనా చర్య తీసుకున్నారా అని కేంద్రం అడిగినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నాయి. టీఎంసీ ప్రభుత్వంలో జరిగిన తీవ్రమైన పరిపాలనా వైఫల్యానికి నిదర్శనంగా బీజేపీ అభివర్ణించగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఆరోపణలను ఖండించారు. బీజేపీ రాష్ట్రపతి కార్యాలయాన్ని రాజకీయం చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు.
Latest News