|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:17 PM
ఏపీలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశామని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పాటు పడుతుందని చెప్పారు.
'తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలుచేస్తున్నది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం.
5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని... ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.... కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇక రాష్ట్రపతి ముర్ముకు బెంగాల్లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆమె బెంగాల్లో పర్యటించగా.. మమత ప్రభుత్వం ప్రోటోకాల్ను విస్మరించింది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ ఎయిర్పోర్టుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రపతి పడుతున్న వేదనను చూసి తాను తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. రాష్ట్రపతి మన గణతంత్ర దేశపు అత్యున్నత గౌరవానికి చిహ్నమని, ఆ పదవికి ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం, మర్యాదలు దక్కాలన్నారు. ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, వాటి పవిత్రతను కాపాడటం మనందరి ఉమ్మడి బాధ్యత అని చంద్రబాబు తన ట్వీట్లో పిలుపునిచ్చారు.
Latest News