|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 08:16 PM
Jammu and Kashmir : ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీ మరణంతో కాశ్మీర్లో ముస్లింలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, భద్రతా బలగాలు పలు ఆంక్షలు విధించాయి.అయితే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో శనివారం నుంచి ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. దీంతో అక్కడ జనజీవనం మామూలు స్థితికి చేరుకుంది. గతవారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి.ఈ ఘటనను వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్లోని షియా ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఆదివారం వరకు ఈ నిరసనలు ప్రశాంతంగా కొనసాగాయి. కానీ సోమవారం శ్రీనగర్లోని లాల్ చౌక్కు పెద్ద సంఖ్యలో నిరసనకారులు చేరుకునే ప్రయత్నం చేశారు.లాల్ చౌక్ సమస్యాత్మక ప్రాంతంగా భావించిన పోలీసులు, భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఆగ్రహానికి గురై పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు కొన్ని దుకాణాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా ఈ ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేశారు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. చారిత్రక లాల్ చౌక్ చుట్టూ కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. ఆరేళ్ల తర్వాత ఇలా లాల్ చౌక్ను మూసివేయడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.ఇంటర్నెట్ సేవలపై కూడా పరిమితులు విధించారు. చారిత్రక జామియా మసీదును తాత్కాలికంగా మూసివేశారు. మసీదు పెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ను హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం కూడా మసీదు తెరవలేదు.అయితే శుక్రవారం నాటికి పరిస్థితులు కొంతమేరకు శాంతించాయి. ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించారు. ఎలాంటి ఉద్రిక్తతలు నమోదు కాకపోవడంతో పోలీసులు శనివారం నుంచి ఆంక్షలను ఎత్తివేశారు. లాల్ చౌక్ను కూడా తిరిగి తెరిచారు.దీంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వారం రోజుల తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Latest News