|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:39 PM
హిందూ మహాసముద్రంలోని శ్రీలంక జలాల్లో ఇరాన్ యుద్ద నౌక ఐరెస్ డేనాను జలాంతర్గామితో అమెరికా దాడి చేసి ముంచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 32 ఇరాన్ నావికులను శ్రీలంక నేవీ, మెరైన్ దళాలు రక్షించి, ఆసుపత్రికి తరలించాయి. అయితే, వీరిని తిరిగి ఇరాన్కు పంపొద్దంటూ శ్రీలంకపై అగ్రరాజ్యం ఒత్తిడి చేస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది. వీరితో పాటు శ్రీలంక కస్టడీలోని మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరెస్ బుషహర్ సిబ్బందిని కూడా పంపొందని అమెరికా కోరినట్టు విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం వెలువరించింది.
విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 కోసం వచ్చిన ఐరిస్ డెనా ఇరాన్ యుద్ధ నౌక.. స్వదేశానికి తిరుగు వెళ్తుండగా అమెరికా దాడి చేసింది. ఈ సమయంలో ఇరాన్ యుద్ధనౌకలో 180 మంది ఉండగా.. 150 మంది గల్లంతయ్యారు. వీరిలో మరో 32 మందిని శ్రీలంక భద్రతా దళాలు రక్షించాయి. ఇక, సాంకేతిక సమస్యల కారణంగా తమ జలాల్లో నిలిచిపోయిన మరో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ బుషెహర్లోని 204 మందిని శ్రీలంక రెస్క్యూ చేసి సురక్షితంగా కొలంబోకు తరలించింది. వీరంతా ప్రస్తుతం శ్రీలంక రక్షణలోనే ఉన్న వీరిని ఇరాన్కు తిరిగి పంపొద్దని అమెరికా కోరినట్టు సమాచారం. ఒకవేళ వీరిని స్వదేశానికి పంపితే తమకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని అమెరికా అనుమానిస్తోంది. ఆ ప్రచారాన్ని అడ్డుకోడానికే కొలంబో ప్రభుత్వంపై అగ్రరాజ్యం ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, దీనికి సంబంధించి అటు అమెరికా.. ఇటు శ్రీలంక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
శ్రీలంకలోని అమెరికా దౌత్య అధికారి జేన్ హోవెల్.. ఐరెస్ బూషహర్ సిబ్బందిని, డేనాలో ప్రాణాలతో బయటపడిన 32 మందిని ఇరాన్కు తిరిగి పంపొద్దని లంక ప్రభుత్వానికి నొక్కి చెప్పారని నివేదిక తెలిపింది. ‘శ్రీలంక అధికారులు ప్రచారం కోసం ఖైదీలను ఉపయోగించుకునే ఇరానియన్ ప్రయత్నాలను తగ్గించాలి’ అని మార్చి 6 నాటి అంతర్గత కేబుల్ పేర్కొంది.
దీనిపై విదేశాంగ శాఖ వెంటనే స్పందించడానికి నిరాకరించింది. భారత్, శ్రీలంకలోని ఇజ్రాయెల్ రాయబారి.. సిబ్బందిని ఇరాన్కు తిరిగి పంపే ప్రణాళిక లేదని హోవెల్ చెప్పినట్లు కేబుల్ తెలిపింది. ఇక, శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పందిస్తూ.. ఇరాన్ సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన మానవతా బాధ్యత తమకు ఉందని అన్నారు. కాగా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ యుద్ధ నౌకతో అమెరికా జలాంతర్గామితో దాడిచేసి ముంచేయడం ఇదే మొదటిసారని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. డేనాపై దాడికి ముందు అమెరికా ఎటువంటి హెచ్చరికలు చేయలేదని పేరు చెప్పడానికి నిరాకరించిన అమెరికా అధికారులు తెలిపారు. మరోవైపు, ఐరెస్ డేనా రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత్ నౌకాదళం రెండు నౌకలను పంపిన సంగతి తెలిసిందే.
Latest News