|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 06:27 PM
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో తన స్థలం కూడా పోయిందంటూ ఏపీ మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగు రోడ్డు వ్యహారంలో అక్రమాలు జరిగాయని తనపై కూడా కేసులు పెట్టారని.. కానీ తాను 2001లో కొనుగోలు చేసిన 60 సెంట్ల నా సొంత స్థలం కూడా తన స్థలం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో పోయింది అన్నారు. విజయవాడ సమీపంలో ఈడుపుగల్లులో ఉన్న తన స్థలం మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుంది అన్నారు. 'మా వాళ్లు ఆ స్థలంలో బిల్డింగ్ నిర్మాణం కోసం వెళ్తే సీఆర్డీయే వాళ్లు మీ స్థలం లేదని మా వాళ్లతో చెప్పారు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారు.. ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది కాబట్టి.. ఎలాంటి కామెంట్స్ చేయను' అన్నారు నారాయణ.
మంత్రి నారాయణ అమరావతిలోని నేలపాడులో పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారులు టైప్ -1,టైప్ -2,గ్రూప్ - డి ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని.. మొత్తం 4026 ఇళ్లకు అంతర్గత పనులు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు వచ్చాయని.. వర్షాల వల్ల గత నవంబర్ వరకు పనులు జరగలేదన్నారు. అమరావతిలో ప్రైవేట్ సంస్థలు నిర్మాణ పనులు కూడా చాలా వరకూ జరుగుతున్నాయని.. టార్గెట్ ప్రకారం పనులు చేయకపోవడంపై షాపూర్జీ - పల్లోంజి మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
అమరావతిలో అభివృద్ధి పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కొన్ని కాంట్రాక్ట్ సంస్థలపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. టార్గెట్ పెట్టుకుని పనులు చేస్తున్నప్పుడు అందుకు తగినవిధంగా నిర్మాణ సంస్థలు పనులు చేయాల్సిందే అన్నారు. ఒకవేళ పనులు చేయలేకపోతే వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. అమరావతిపై వైఎస్సార్సీపీ నేతలు చేసే ఆరోపణల్ని ప్రజలు నమ్మరన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో గేమ్ ఆడకుండా ఉండుంటే అమరావతిలో పనులన్నీ ఓ కొలిక్కివచ్చేవి అన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టామని.. మూడు నెలల్లో రోడ్ల పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రాబోయే మూడేళ్లలో పరిపాలనకు సంబంధించిన భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి నారాయణ.