|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:21 PM
లిబియా మాజీ నియంత మౌమ్మర్ గడాఫీ కుమారుడు, ఒకప్పుడు ఆ దేశానికి కాబోయే పాలకుడిగా భావించిన సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ (53) దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ లిబియాలోని జింతాన్ నగరంలో ఉన్న ఆయన నివాసంలోకి నలుగురు సాయుధులు చొరబడి జరిపిన కాల్పుల్లో సైఫ్ మరణించినట్లు ఆయన రాజకీయ కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది.సైఫ్ అల్-ఇస్లాం న్యాయవాది మాట్లాడుతూ.. ఇదొక ప్రణాళికాబద్ధమైన 'అసాసినేషన్' అని పేర్కొన్నారు. ఒక కమాండో యూనిట్ తరహాలో వచ్చిన నలుగురు వ్యక్తులు నేరుగా ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారన్నారు. అయితే, ఈ దాడికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? దీని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏవి? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. మరోవైపు, సైఫ్ సోదరి స్పందిస్తూ ఆయన అల్జీరియా సరిహద్దుల్లో మరణించారని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.గడాఫీ 40 ఏళ్ల పాలనలో సైఫ్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఉండేవారు. 2011 ప్రజా తిరుగుబాటులో గడాఫీ పతనం తర్వాత సైఫ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అదే ఏడాది పట్టుబడిన ఆయన దాదాపు పదేళ్ల పాటు బందీగా గడిపారు. విడుదలైన తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించడం ద్వారా లిబియా రాజకీయాల్లో మళ్లీ సంచలనం సృష్టించారు.
Latest News