|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 01:52 PM
మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం వైయస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్ వీ సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గూండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ అంశంలో సిట్ నివేదికలో చంద్రబాబువి అబద్ధాలు అని తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు. కూటమి పాలనలో సామాన్య ప్రజలతో పాటు, మాజీ మంత్రులుకు కూడా భద్రత లేకుండా పోయిందన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, మాజీ సీఎం వైయస్ జగన్తో పాటు టీటీడీ మాజీ చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ద్వారా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. తమ వైఫల్యాలు ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులు.. దాడి చేసే గూండాలకు రక్షణగా నిలబడి, బాధితులపైనే కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాయలసీమకు ప్రాణాధారమైన ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి... ఆ ప్రాంత ప్రజల హక్కులను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్, హింసా రాజకీయాలు ఎక్కువకాలం సాగవని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధిచెప్పడం ఖాయమని హెచ్చరించారు.
Latest News