పెంపుడు కుక్క కరిస్తే యజమానిపై కేసు.. జరిమానా, జైలుశిక్ష కూడా: సర్కారు సంచలన నిర్ణయం
 

by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:34 PM

పెంపుడు కుక్కల యజమానులకు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ మున్సిపల్ కార్పొరేషన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇటీవలి కాలంలో కుక్కల దాడులు.. ముఖ్యంగా పిట్‌బుల్, రాట్‌వీలర్ వంటి ప్రమాదకర జాతుల స్వైర విహారం పెరిగిపోవడంతో ప్రభుత్వం 'డెహ్రాడూన్ డాగ్ లైసెన్సింగ్ బైలాస్-2025' పేరుతో కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా.. యజమానిపై నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.


కుక్క కరిస్తే యజమానిదే బాధ్యత


రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మొత్తంగా 24,500 కంటే ఎక్కువ కుక్క కాటు కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో పౌరుల భద్రత కోసం కార్పొరేషన్ కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఒకవేళ పెంపుడు కుక్క ఎవరినైనా కరిస్తే.. బాధితుడి గాయం తీవ్రతను బట్టి జరిమానా విధిస్తారు. తీవ్రమైన గాయాలు అయితే యజమానిపై క్రిమినల్ కేసు పెట్టడమే కాకుండా ఆ కుక్కను కార్పొరేషన్ తన స్వాధీనంలోకి తీసుకుంటుంది.


ప్రమాదకర జాతులపై ఉక్కుపాదం


పిట్‌బుల్, రాట్‌వీలర్, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్ వంటి 'అగ్రెసివ్' జాతుల కుక్కలను పెంచుకునే వారికి ప్రత్యేక నిబంధనలు విధించారు. ముఖ్యంగా ఇలాంటి అగ్రెసివ్ కుక్కలను పెంచుకోవాలంటే కనీసం 300 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఇల్లు తప్పనిసరి. అలాగే ఈ ప్రమాదకర జాతుల బ్రీడింగ్‌ను (సంతానోత్పత్తి) పూర్తిగా నిషేధించారు. ఏడాది వయసు దాటిన అగ్రెసివ్ కుక్కలకు తప్పనిసరిగా సర్జరీ చేయించి.. ఆ సర్టిఫికేట్‌ను అధికారులకు సమర్పించాలి. సాధారణ కుక్కల కంటే వీటికి ఏటా రూ. 2,000 లైసెన్స్ ఫీజు చెల్లించాలి.


ఇది మాత్రమే కాకుండా మూడు నెలల వయసు దాటిన ప్రతీ కుక్కకు మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలి. అయితే ఇది కావాలంటే కచ్చితంగా యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ చేయించాలి. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం కూడా తీసుకోవాలి. ఇది ఉంటేనే మున్సిపాలిటీ లెసెన్స్ ఇస్తుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిప్పేటప్పుడు కుక్కకు తప్పనిసరిగా గొలుసు, ముఖానికి మాస్క్ వేయాలి. రాత్రివేళ కుక్కలు విపరీతంగా మొరుగుతూ ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగిస్తే.. యజమానికి నోటీసులు ఇచ్చి చలానా విధిస్తారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ కుక్కలను పెంచేవారు దానిని 'ప్రైవేట్ యానిమల్ షెల్టర్'గా గుర్తించి.. పొరుగువారి నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పొందాలి.


ప్రజా భద్రత, జంతువుల పట్ల బాధ్యతాయుతమైన పెంపకాన్ని ప్రోత్సహించడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ నమామి బన్సల్ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షకు కూడా సిద్ధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు.


Latest News
41 Maoists, including 39 from Chhattisgarh, surrender before Telangana Police Fri, Dec 19, 2025, 04:56 PM
India-Oman free trade pact likely to become operational within 3 months: Piyush Goyal Fri, Dec 19, 2025, 04:55 PM
Hanwha Ocean wins $1.75 billion order for 7 LNG carriers from Europe Fri, Dec 19, 2025, 04:49 PM
EAM Jaishankar and Netherlands counterpart discuss bilateral ties, global issues Fri, Dec 19, 2025, 04:46 PM
Odds are slim, fight until last ball: Hussain says England 'need miracle' to keep Ashes hopes alive Fri, Dec 19, 2025, 04:38 PM