|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:29 PM
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మహిళా డాక్టర్ హిజాబ్ను తొలగించిన ఉదంతం దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనను సమర్థిస్తూ ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి సంజయ్ నిషాద్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోశాయి. నితీష్ కుమార్ చర్యను వెనకేసుకొస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
అసలేమిటీ వివాదం?
పాట్నాలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో నితీష్ కుమార్ నూతనంగా ఎంపికైన ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో నుస్రత్ పర్వీన్ అనే మహిళా డాక్టర్ వేదికపైకి రాగా.. ఆమె ధరించిన హిజాబ్ను చూసిన నితీష్ కుమార్ ‘ఏమిటిది?’ అన్నట్లుగా సైగ చేశారు. ఆమె స్పందించేలోపే.. ఆయనే స్వయంగా ఆమె హిజాబ్ను కిందకు లాగి ముఖం కనిపించేలా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నితీష్ కుమార్ మానసిక స్థితిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు కురిపించాయి.
ఈ ఘటనపై స్పందించిన యూపీ మంత్రి సంజయ్ నిషాద్ ఒక లోకల్ ఛానెల్తో మాట్లాడుతూ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. "ఆయన కూడా మనిషే కదా, ఇలా ఆయన వెంట పడకూడదు. కేవలం హిజాబ్ను తాకినందుకే ఇంత గొడవ చేస్తున్నారే.. ఒకవేళ మరెక్కడైనా తాకి ఉంటే ఇంకెంత రభస చేసేవారు?" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
సంజయ్ నిషాద్ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ నేత సుమయ్య రాణా తీవ్రంగా స్పందించారు. లక్నోలోని కైసర్బాగ్ పోలీస్ స్టేషన్లో నితీష్ కుమార్, సంజయ్ నిషాద్లపై ఫిర్యాదు చేశారు. నితీష్ కుమార్ ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించారని.. మంత్రి నిషాద్ తన వ్యాఖ్యల ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అస్లాం షేక్ ఈ వ్యాఖ్యలను "దుర్మార్గమైనవి" అని అభివర్ణిస్తూ.. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివాదం ముదరడంతో సంజయ్ నిషాద్ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఆ మాటలను కేవలం స్థానిక భోజ్పురి యాసలో క్యాజువల్గా అన్నానని, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశ్యం తనకు లేదని పేర్కొన్నారు. అయితే ఒక మహిళ పట్ల జరిగిన అనుచిత చర్యను సమర్థిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని మహిళా హక్కుల కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు.
Latest News