|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:17 PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బీజేపీ సర్కారుకు మద్దతిస్తున్నారు. తన సొంత పార్టీలోని సమావేశాలకే హాజురు కాని ఈయన.. ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలతో కలిసేందుకు తెగ ఆసక్తి కనబర్చారు. చాలా నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా.. తాజాగా ఆయన రూటు మార్చారు. ముఖ్యంగా ఎప్పుడూ బేజీపీని ప్రశంసించే ఈయన.. ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం (MGNREGA) పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) బిల్లు- 2025ను మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగానే ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ.. పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం అనైతికం అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కొత్త పేరులో 'రామ్' (జీ రామ్ జీ) అనే పదాన్ని వాడటంపై స్పందించారు. రాముడి పేరును అపవిత్రం చేయొద్దంటూ ప్రభుత్వానికి గట్టి విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజున కూడా థరూర్ ఈ పేరు మార్పుపై ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"ఎంజీనరేగా పేరు మార్చి.. కేంద్రం కొత్తగా 'జీ రామ్ జీ' బిల్లు తీసుకురావడంపై జరుగుతున్న వివాదం దురదృష్టకరం. మహాత్మాగాంధీ బోధించిన గ్రామ స్వరాజ్ సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీపడేవి కావు. వాస్తవానికి గాంధీజీ దృక్పథానికి అవి రెండూ మూల స్తంభాలు లాంటివి" అని థరూర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ పథకానికి పేరు మార్చడం అంటే గాంధీజీ ఆదర్శాలను విస్మరించినట్లే అని ఎంపీ శశిథరూర్ తెలిపారు. ఆయన వారసత్వాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేయొద్దని థరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శశి థరూర్ గత కొంతకాలంగా సొంత పార్టీ కాంగ్రెస్తో విభేదిస్తూ.. మోదీ ప్రభుత్వంపై బహిరంగంగా ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సొంత పార్టీ నేతల ఆగ్రహానికి కూడా ఆయన గురయ్యారు. అయితే తాజాగా ఎంజీనరేగా పేరు మార్పు విషయంలో ఆయన కాంగ్రెస్ వైఖరికి మద్దతుగా మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై థరూర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అసలీయన ఎందుకు బీజేపీతో విభేదించారు, మళ్లీ కాంగ్రెస్కు ఎందుకు మద్దతిస్తున్నారో అని అంతా ఆలోచిస్తున్నారు.
Latest News