|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:32 PM
థాయ్లాండ్-కంబోడియా సరిహద్దులో మళ్లీ సైనిక ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. కంబోడియా దళాలు సోమవారం తెల్లవారుజామున కాల్పులు జరపడంతో.. ఓ థాయ్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ప్రతిగా థాయ్ వైమానిక దళం భారీగా దాడులు చేసి.. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ విషయం గురించి థాయ్లాండ్ సైనిక ప్రతినిధి, మేజర్ జనరల్ వింథాయ్ సువారే మాట్లాడుతూ.. సోమవారం తెల్లవారుజామున కంబోడియా దళాలు తమపై కాల్పులు మొదలు పెట్టాయని తెలిపారు. ఈ దాడిలో తమకు చెందిన ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో థాయ్ దళాలు వెంటనే అప్రమత్తమై వైమానిక దాడులు ప్రారంభించాయి. కంబోడియా సైనిక పోస్టులను, ఆయుధాగారాలను లక్ష్యంగా చేసుకొని థాయ్ యుద్ధ విమానాలు భారీగా బాంబులు వేశాయి. అయితే థాయ్ దళాల వాదనను కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రహ్ విహియార్ ప్రావిన్స్లో ముందుగా థాయ్ దళాలే కాల్పులు జరిపాయని కంబోడియా ఆరోపించింది.
గతంలో థాయ్లాండ్-కంబోడియా సరిహద్దు వివాదాలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఈ ఏడాది కౌలాలంపుర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. గడిచిన కొద్ది నెలలకే ఈ ఒప్పందం విఫలమై.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం గమనార్హం.
ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తాను నిలిపివేశానని చెప్పుకునే ఎనిమిది యుద్ధాల్లో థాయ్-కంబోడియా ఘర్షణ కూడా ఒకటి. అయితే తాజాగా జరిగిన ఈ ఘర్షణలు.. యుద్ధాన్ని ముగించామన్న ట్రంప్ ప్రకటనపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. తాజా ఉద్రిక్తత కారణంగా సరిహద్దుల్లో పూర్తి యుద్ధ వాతావరణం నెలకొంది.
Latest News