|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:31 PM
తమిళనాడు రాష్ట్ర మున్సిపల్, నీటి సరఫరా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. రూ.1,020 కోట్ల అవినీతి ఆరోపణలకు సంబంధించి మంత్రిపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి తాము లేఖ రాసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. టెండర్లు తెరవడానికి ముందే ప్రభుత్వ కాంట్రాక్టులను తారుమారు చేసి, ముందే నిర్ణయించిన కాంట్రాక్టర్లకు కేటాయించారని ఈడీ ఆరోపించింది. మరుగుదొడ్ల నిర్మాణం, ఔట్సోర్సింగ్ పనులతో సహా నిర్మాణ ప్రాజెక్టుల కోసం 7.5 శాతం నుంచి 10 శాతం వరకు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ రూ.1,020 కోట్ల అవినీతి కేవలం ఒక మితమైన అంచనా మాత్రమేనని.. ఇతర రకాల తారుమారు ద్వారా జరిగిన అవినీతిని ఇంకా లెక్కించలేదని అధికారులు అంటున్నారు. ఈ చెల్లింపులు నగదు రూపంలో, హవాలా లావాదేవీల ద్వారా జరిగాయని ఈడీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి 258 పేజీల డాక్యుమెంట్ను ఈడీ పంపింది. ఇందులో 300కు పైగా ఫోటోలు, స్క్రీన్షాట్లు ఉన్నాయి. కాంట్రాక్టు వివరాలు, లంచం ఇచ్చిన వారి పేర్లు, పంచాయితీ పేరు, చెల్లించిన, చెల్లించాల్సిన లంచం వంటి వివరాలు ఉన్న రికవరీ చేయబడిన నోట్లు, సందేశాలను కూడా ఈడీ సేకరించింది.
గతంలోలాగా కాకుండా ఈసారి ఈడీ ముఖ్య కార్యదర్శి, ఇన్ఛార్జ్ డీజీపీ, డీవీఏసీకు నేరుగా లేఖ రాసింది. ఈడీ నుంచి పత్రాలు అందినట్లు డీవీఏసీ వర్గాలు ధృవీకరించాయి. అయితే వాటిని పరిశీలించాల్సి ఉందని తెలిపాయి. నిజానికి మంత్రి సోదరుల నిర్మాణ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్పై రూ.30 కోట్ల బ్యాంక్ మోసం కేసు దర్యాప్తు సందర్భంగా ఈడీకి కీలక ఆధారాలు దొరికాయి. సోదరుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాల నుంచి ఈ టెండర్ అవినీతికి సంబంధించిన సాక్ష్యాలను ఈడీ సేకరించింది.
గతంలో మంత్రి కేఎన్ నెహ్రూ ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవంటూ కొట్టిపారేశారు. అన్నా యూనివర్సిటీ పరీక్షలు నిర్వహించిందని, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన అన్నారు. మరోవైపు అధికార డీఎంకే పార్టీ దీనిని ఎన్నికల స్టంట్గా అభివర్ణించింది. ఈడీ విశ్వసనీయత అణగారిపోయిందని.. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం ఈ నరేటివ్ను సెట్ చేయాలని చూస్తోందని డీఎంకే ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా ఆరోపించారు.
Latest News