|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:27 PM
ఉత్తర గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో సంభవించిన అగ్ని ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే ఆయనపై పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే క్లబ్ యాజమాన్యం (మేనేజ్మెంట్) ఈ విషాదంపై తొలిసారిగా ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రాణ నష్టం జరగడంపై చాలా కలత చెందామని పేర్కొంది. ఈ భరించలేని దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తమ అచంచలమైన మద్దతు ఉంటుందని ప్రకటనలో తెలిపింది. బాధిత కుటుంబాలకు "సాధ్యమయ్యే ప్రతి విధమైన సహాయం, మద్దతు, సహకారాన్ని" అందిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
సౌరభ్ లూత్రా గత ఏడాది వరకు భారతదేశం అంతటా 50 రెస్టారెంట్లు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే గోవాలో లూత్రా చట్టపరమైన వ్యవహారాలకు కూడా చాలా అరుదుగా హాజరు అవుతాడని.. తరచుగా తన ప్రతినిధులను పంపుతాడని సామాజిక కార్యకర్త తహిర్ నోరోన్హా ఆరోపించారు. క్లబ్లోని సిబ్బంది కూడా లూత్రా స్వభావం చాలా దురుసుగా ఉంటుందని తెలిపారు. కిచెన్ వర్కర్ ఒకరు మాట్లాడుతూ.. లూత్రా నెలకు ఒకసారి మాత్రమే క్లబ్ను సందర్శించే వారని, ఉద్యోగులతో అస్సలు మాట్లాడేవారు కాదని చెప్పారు.
ఈ రోజు ఉదయం గోవా పోలీసులు క్లబ్కు సంబంధించిన మరో మేనేజర్ అయిన భరత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో డ్యాన్స్ ఫ్లోర్లో 100 నుంచి 200 మంది వరకు ఉన్నట్లు అంచనా. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కిచెన్ ప్రాంతంలోకి పారిపోయి.. అక్కడే సిబ్బందితో పాటు చిక్కుకుపోయినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు ప్రస్తుతం లూత్రా సోదరుల కోసం గాలిస్తున్నారు. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయడంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భద్రతా నియమాలు, బాధ్యత విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Latest News