|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 10:31 PM
తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం వచ్చింది. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ భక్తుడు టీటీడీకి రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. శివ ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10, 01,116 విరాళంగా అందజేశారు. ఆదివారం రోజున తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అధికారులు అభినందించారు. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ట్రస్టుకు కూడా భారీ విరాళం అందింది.
హైదరాబాద్కు చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం అందించింది. సంస్థ తరుఫున ప్రతినిధులు శనివారం రోజున టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు.
పట్నాలో శ్రీవారి ఆలయం..
మరోవైపు అన్ని రాష్ట్రాల రాజధానులలోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిహార్ రాజధాని పట్నాలోనూ శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి బిహార్ ప్రభుత్వం అంగీకరించింది. బిహార్ ప్రభుత్వం నిర్ణయంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో టీటీడీ ఆలయం నిర్మించనుంది. ఈ ఆలయం కోసం బిహార్ ప్రభుత్వం 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ విషయాన్ని బిహార్ సీఎస్.. టీటీడీ ఛైర్మన్కు లేఖ ద్వారా తెలియజేశారు. టీటీడీకి కేటాయించిన స్థలంలో ఆలయాన్ని నిర్మించేందుకు బిహార్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మరోవైపు ఆలయం నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి భూమిని 99 సంవత్సరాల పాటు అద్దెకు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 1 టోకెన్ లీజ్ రెంట్తో ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు బిహార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. బిహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఆ స్థలంలో టిటిడి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో బిహార్లో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. బిహార్ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్తో టీటీడీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతారని..ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.
Latest News