|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:25 PM
భారతీయులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు కూత పెట్టేందుకు రెడీ అయింది. 2019లో వందే భారత్ రైలు ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రయాణికుల నుంచి బాగా ఆదరణ పొందుతోంది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 100 వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే ప్రయాణికులు త్వరలో కొత్త శకంలోకి అడుగు పెట్టబోతున్నారు. తేజస్ రైలుకు సమానమైన వేగం.. రాజధాని రైలుకు సరితూగే సౌకర్యాలు.. వందే భారత్ రైలులోని అధునాతన టెక్నాలజీ కలగలిపిన రైలు.. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రూపంలో అందుబాటులోకి రానుంది. ఈ చారిత్రక రైలు డిసెంబర్ చివరి నాటికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి బిహార్ రాజధాని పట్నా మార్గంలో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైలును బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఫ్యాక్టరీలో రెండు రేక్లు తయారు చేస్తుండగా.. అందులో మొదటి రేక్ సిద్ధమైంది. ట్రయల్ రన్ కోసం ఈ రేక్ను డిసెంబర్ 12వ తేదీన నార్తర్న్ రైల్వేకు పంపించనున్నారు. ఈ హైటెక్ రైలులో 16 కోచ్లు, 827 బెర్త్లు ఉంటాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి.. కవచ్ భద్రతా వ్యవస్థతో తయారు చేశారు. ఈ రైలు రాత్రిపూట సుదూర ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాన్ని అందించనుంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైలు లోని 16 కోచ్లలో మొత్తం 827 బెర్త్లు అందుబాటులో ఉంటాయి. థర్డ్ ఏసీలో 611, సెకండ్ ఏసీలో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్లు ఉంటాయి. అవసరమైతే ఈ కోచ్ల సంఖ్యను 24కి పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక వందే భారత్ స్లీపర్ రైలు అత్యాధునిక సౌకర్యాలు, భద్రతపై దృష్టి సారించి రూపొందించబడింది.
ఈ రైలులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, ప్రీమియం నాణ్యత గల సౌకర్యవంతమైన ఇంటీరియర్లు ఏర్పాటు చేశారు. ఈ రైలు గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుండగా.. ఇది కవచ్ వ్యవస్థతో సహా అధునాతన భద్రతా టెక్నాలజీలు, క్రాష్ రెసిస్టెంట్ నిర్మాణాన్ని కలిగి ఉంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైలును న్యూఢిల్లీ-రాజేంద్రనగర్ మధ్య నడిచే తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ తరహాలో నడిపేందుకు భారతీయ రైల్వే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దానాపూర్ డివిజన్ అధికారులు ఈ నెల చివరి నాటికి రెగ్యులర్ కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలు వారానికి 6 రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి సాయంత్రం బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోనుంది. తిరుగు ప్రయాణం కూడా తేజస్ రాజధాని షెడ్యూల్కు సమానంగా ఉంటుంది.
Latest News