నా భర్త మోసం చేశాడు, న్యాయం చేయండి.. ప్రధాని మోదీకి పాకిస్తానీ మహిళ విజ్ఞప్తి
 

by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:20 PM

పాకిస్తాన్‌కు చెందిన నిఖిత నాగ్దేవ్ మహిళ.. తన భర్త విక్రమ్ నాగ్దేవ్ మోసం చేశాడని ఆరోపిస్తూ.. తనకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. 2020లో పాకిస్తాన్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం విక్రమ్ తనను వివాహం చేసుకున్నాడని.. ఆ తర్వాత తనను భారత్‌కు తీసుకువచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత వీసా సమస్యల పేరుతో తిరిగి కరాచీకి పంపించాడని.. అప్పటి నుంచి మళ్లీ తీసుకెళ్లలేదని పేర్కొంది. కానీ ఇప్పుడు అతడు మరొక మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని సింధీ పంచాయత్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. విక్రమ్‌ను అక్రమంగా నివసిస్తున్నాడని ఆరోపిస్తూ దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిఖిత నాగ్దేవ్ తన ఆవేదనను వివరిస్తూ పాకిస్తాన్ నుంచి ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. 2020 జనవరి 26వ తేదీన పాకిస్తాన్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం.. విక్రమ్ నాగ్దేవ్‌ను నిఖిత పెళ్లి చేసుకుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రంలో మాత్రం వారి పెళ్లి తేదీ 2020 జనవరి 20వ తేదీగా ఉంది.


వివాహం జరిగిన నెల రోజుల తర్వాత.. అంటే 2020 ఫిబ్రవరి 26వ తేదీన విక్రమ్ తనను భారత్‌కు తీసుకువచ్చాడని నిఖిత తెలిపింది. అదే ఏడాది జూలై 9వ తేదీన వీసా సమస్యలు ఉన్నాయని చెప్పి విక్రమ్ తనను తిరిగి కరాచీకి పంపినట్లు పేర్కొంది. ఇక అప్పటినుంచి.. తనను తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి అతను ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించింది. తనను తిరిగి భారత్‌కు తీసుకురావాలని విక్రమ్‌ను నిఖిత పదేపదే అడిగినప్పటికీ.. అతడు నిరాకరించాడని చెప్పింది.


ఈ క్రమంలోనే ఇటీవలె విక్రమ్.. ఢిల్లీకి చెందిన శివాంగి ధింగ్రా అనే మహిళతో నిశ్చితార్థం చేసుకున్నాడని పేర్కొంది. వీరి వివాహం 2026 మార్చి చివరి వారంలో జరగనుందని ఆరోపించింది. ఇక తాను ఒకసారి శివాంగి ధింగ్రాతో మాట్లాడినప్పుడు.. ఆమెకు విక్రమ్ గురించి ఏమీ తెలియదని ఖండించినట్లు నిఖిత తెలిపింది. ఈ విషయాన్ని ఇండోర్‌లోని సింధీ పంచ్ మధ్యవర్తిత్వం, న్యాయ సలహా కేంద్రంలో నిఖిత ఫిర్యాదు చేసింది.


పంచాయతీ అధ్యక్షుడు కిషోర్ కోడ్వానీ.. నిఖిత ఫిర్యాదును స్వీకరించినప్పటికీ.. ఈ అంశం తమ అధికార పరిధికి వెలుపల ఉందని.. ఆమె కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. అయినప్పటికీ వారు ఈ విషయంపై కలెక్టర్‌కు లేఖ రాశారు. విక్రమ్ భారత పౌరుడు కాదని.. అతడు అక్రమంగా నివసిస్తున్నాడని పంచాయత్ ఆరోపించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అతను అక్రమంగా ఆస్తులను కొనుగోలు చేశాడని కూడా ఆరోపణలు చేసింది. విక్రమ్‌ను భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశ బహిష్కరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.


విక్రమ్ భారత చట్టాలను, సామాజిక నిబంధనలను పాటించడం లేదని.. సింధీ పంచాయత్ సూచించింది. అందుకే నిఖిత కరాచీ కోర్టులో న్యాయం పొందాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీడియో విడుదల చేసిన నిఖిత.. ప్రస్తుతం తనకు న్యాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపింది.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM