|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:16 PM
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన - మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది. ఈ విషయాన్ని స్మృతి మంధాన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పలాశ్ ముచ్చల్తో తన పెళ్లి రద్దయినట్లు స్మృతి మంధాన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం స్మృతి మంధాన పలాశ్ ముచ్చల్ వివాహం నవంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురికావటం, ఆ తర్వాత పలాశ్ ముచ్చల్ అస్వస్థత తదితర కారణాలతో వీరి వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్నో వార్తలు ప్రచారంలోకివచ్చాయి. ఈ క్రమంలోనే పెళ్లిపై కీలక ప్రకటన చేశారు స్మృతి మంధాన.
కొన్ని వారాలుగా తన జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు నడిచాయన్న స్మృతి మంధాన.. ఇలాంటి సమయంలో తాను మాట్లాడటం చాలా ముఖ్యమంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. సాధారణంగా తాను అన్నీ గోప్యంగా ఉండాలనుకునే వ్యక్తినని కానీ.. పెళ్లి రద్దయిందని అందరికీ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని.. రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని స్మృతి మంధాన కోరారు. జీవితంలో ముందుకెళ్లేందుకు స్పేస్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశం తరుఫున మరిన్ని మ్యాచ్లు ఆడి, ట్రోఫీలు గెలుస్తానని.. దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని రాసుకొచ్చారు, తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
మరోవైపు స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్ స్పందించారు. తన పర్సనల్ రిలేషన్షిప్ ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో ఎమోషనల్ స్టోరీ రాసుకొచ్చారు. జీవితంలో ముందుకు సాగడానికి.. వ్యక్తిగత సంబంధాల నుంచి బయటకు వస్తున్నానంటూ ఇన్స్టా స్టోరీ షేర్ చేశారు. నిరాధారమైన రూమర్ల గురించి ప్రజలు స్పందించిన విధానం తనకు చాలా కష్టంగా తోచిందన్న పలాశ్ ముచ్చల్.. గాసిప్ ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావడం మానుకోవాలని ప్రజలకు సూచించారు. మన మాటలు ఎంతలా గాయపరుస్తాయనేదీ మనం అసలు ఊహించలేమని రాసుకొచ్చారు. ప్రస్తుతం తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నానన్న ముచ్చల్.. ఈ దశను ఎదుర్కొంటానని రాసుకొచ్చారు. మరోవైపు తన గురించి ఆన్లైన్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పలాశ్ ముచ్చల్ హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 23న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహానికి కొన్ని గంటల ముందు స్మృతి మంధాన తండ్రి ఆస్పత్రి పాలయ్యారు. ఆ తర్వాతపలాశ్ ముచ్చల్ సైతం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఆ తర్వాత స్మృతి మంధాన తన పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించటంతో పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అలాగే పలాశ్ ముచ్చల్ చాటింగ్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ పరిణామాల మధ్యలోనే పలాశ్ ముచ్చల్ తల్లి అమిత.. త్వరలోనే స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి జరుగుతుందని ఇటీవల ప్రకటించారు. అయితే దీనిపై స్మృతి కుటుంబం నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.
ఈ పరిణామాల క్రమంలోనే స్మృతి మంధాన పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు 2019 నుంచి స్మృతి మంధాన- పలాశ్ ముచ్చల్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. 2024లో వీరి ప్రేమ గురించి బయటకు వచ్చింది. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. అదే మైదానంలో స్మృతి మంధానకు పలాశ్ ముచ్చల్ ప్రపోజ్ చేయడం వైరల్ అయ్యింది.