|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:56 PM
4 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కీలక ప్రాజెక్టులు, ఒప్పందాలు, పలు అంశాలపై చర్చలు జరిపారు. ఆ సమావేశం తర్వాత.. మోదీ, పుతిన్ జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా.. తమిళనాడులోని కుడంకుళం ప్రాజెక్టుపై పుతిన్ కీలక ప్రకటన చేశారు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అని పుతిన్ అభివర్ణించారు.
తమిళనాడులోని కుడంకుళంలో దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో మొత్తం 6 రియాక్టర్లు ఉండగా.. రెండు ఇప్పటికే విద్యుత్ నెట్వర్క్కు అనుసంధానించారు. మిగిలిన నాలుగు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేయడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలకు గణనీయమైన సహకారం లభిస్తుందని పుతిన్ తెలిపారు. కుడంకుళం ప్లాంట్ మొత్తం 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల 6 VVER-1000 రియాక్టర్లను కలిగి ఉంటుంది.
ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. పుతిన్ ప్రకటన వెలువడిన వెంటనే.. రష్యా అణు సంస్థ రోసాటమ్ ఇంధన డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. కుడంకుళం ప్లాంట్లోని మూడో రియాక్టర్ తొలి లోడింగ్ కోసం తమ మొట్టమొదటి అణు ఇంధనాన్ని (యూరేనియం ఫ్యూయల్) కార్గో విమానంలో రోసాటమ్ కంపెనీ డెలివరీ చేసింది. ఈ ఇంధనాన్ని నోవోసిబిర్స్క్ కెమికల్ కాన్సెంట్రేట్స్ ప్లాంట్ వద్ద తయారు చేశారు. 2024లో భారత్, రష్యా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. మూడు, 4 రియాక్టర్ల మొత్తానికి అవసరమైన ఇంధనం కోసం 7 విమానాల్లో డెలివరీ చేయనుంది.
కొత్త రంగాలలో సహకార విస్తరణ
అణు విద్యుత్తో పాటు.. ఇతర అధునాతన అణు టెక్నాలజీల్లో కూడా భారత్కు సహకరించడానికి రష్యా ముందుకు వచ్చింది. భవిష్యత్తులో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం గురించి ఈ భేటీలో చర్చించినట్లు పుతిన్ పేర్కొన్నారు. కేవలం ఇంధనానికే కాకుండా.. వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా అణు టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి సహకారాన్ని అందిస్తామని పుతిన్ తెలిపారు.
ఇంధన భద్రతకు హామీ
భారతదేశ ఇంధన అభివృద్ధికి అవసరమైన చమురు, గ్యాస్, బొగ్గు వంటి అన్నింటికీ.. రష్యా విశ్వసనీయ సరఫరాదారు అని ఈ సందర్భంగా పుతిన్ హామీ ఇచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఇంధన రవాణాలో ఎలాంటి అంతరాయం ఉండదని ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు భరోసా ఇచ్చారు.
Latest News