|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:36 PM
శ్రీశైలం దేవస్థానం బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. శివస్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని శ్రీశైలం దేవస్థానం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం ఇరుముడి కలిగిన శివస్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నారు. మరోవైపు శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది. స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నారు. అయితే ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రం విడతల వారీగా ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది.
మరోవైపు శ్రీశైలంలో స్పర్శ దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ ద్వారా భారీ సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారు. అలాగే శివమాలధారులు కూడా భారీగా ఆలయానికి వస్తున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్పర్శ దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం దేవస్థానం ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంపార్టుమెంట్లలో ఉండే భక్తులకు అల్పాహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు శ్రీశైలంలో స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు దేవస్థానం అధికారులు ఉచితంగా లడ్డూలు అందిస్తున్నారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు, రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు వీటిని అందిస్తారు. స్పర్శ దర్శనం టికెట్ మీద100 గ్రాముల బరువు ఉండే రెండు లడ్డూలు, అతిశీఘ్ర దర్శనం టికెట్ కలిగిన భక్తులకు ఒక లడ్డూను అందజేస్తున్నారు.
ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలం దేవస్థానంలోని 9,10 కౌంటర్లలో ఈ ఉచిత లడ్డూలు దొరుకుతాయి. స్పర్శ దర్శనం, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్న భక్తులు ఈ కౌంటర్లను సంప్రదించి ఉచితంగా లడ్డూలను పొందవచ్చని అధికారులు సూచించారు.
Latest News