|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:23 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దంటూ జనసేన పార్టీ వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ ఈ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ వివాదంపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరమని షర్మిల అన్నారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమేనని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమన్న షర్మిల.. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని సూచించారు.
శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదని వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్కు సూచించారు. మూడ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కు సబబు కాదన్నారు. కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించాలని.. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. రూ.3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి అనర్హుడని నారాయణ అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిలా ఉన్నాయని నారాయణ మండిపడ్డారు. తెలుగు ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
సాంకేతికంగా విడిపోయినా కూడా.. తెలుగు రాష్టాల ప్రజలు కలిసే ఉన్నారని అన్నారు. పవన్ కల్యాణ్ అప్పట్లో చేగువేరా ఆదర్శం అన్నారని, ఇప్పుడు సావర్కర్ను భుజాన వేసుకున్నారని నారాయణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగడని, వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.
Latest News