|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:44 PM
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ .. క్రికెట్లో తన హవా కొనసాగిస్తున్నాడు. 14 ఏళ్ల వయసులోనే.. ఎవరికీ సాధ్యం కాని రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2025లో మొదలైన అతడి ప్రస్థానం.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కొనసాగుతోంది. ఈ ట్రోఫీలో బిహార్ తరఫున ఆడుతున్న వైభవ్.. మహారాష్ట్రతో మ్యాచులో విజృంభించాడు. సెంచరీతో చెలరేగి రికార్డులు బద్దలు కొట్టాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మంగళవారం మహారాష్ట్ర, బిహార్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో వైభవ్.. 61 బంతుల్లో 108 రన్స్తో అజేయంగా నిలిచాడు. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ కొట్టిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 14 ఏళ్ల 250 రోజులు. అంతకుముందు ఈ రికార్డు మహారాష్ట్రకు చెందిన విజయ్ జోల్ పేరిట ఉండేది. 2013లో అతడు 63 బంతుల్లో శతక్కొట్టాడు. అప్పటికి విజయ్ వయసు 18 ఏళ్ల 118 రోజులు కావడం గమనార్హం.
కాగా వైభవ్ సూర్యవంశీకి గత 16 టీ20 ఇన్నింగ్స్లలో ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం. అంతకుముందు అతడు ఐపీఎల్ 2025, ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025లోనూ టీ20 శతకాలు కొట్టాడు. దీంతో కనీసం 15 ఏళ్లు కూడా నిండకుండానే మూడు టీ20 సెంచరీలు చేసిన ప్లేయర్గానూ సూర్యవంశీ నిలిచాడు.
ఇక ఈ ఏడాది అత్యధిక టీ20 సెంచరీలు చేసిన భారత ప్లేయర్ల జాబితాలోనూ వైభవ్ టాప్లోకి చేరిపోయాడు. వైభవ్ 16 ఇన్నింగ్స్లలో మూడు శతకాలు సాధించాడు. అభిషేక్ శర్మ 34 ఇన్నింగ్స్లలో 2, ఆయుశ్ మాత్రే 10 ఇన్నింగ్స్లలో 2, ఇషాన్ కిషన్ 16 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు కొట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వైభవ్ మెరుపులతో బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం మహారాష్ట్ర 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ పృథ్వీ షా 30 బంతుల్లో 66 పరుగులు స్కోరు చేశాడు.
Latest News