|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 10:43 PM
భారత్తో రెండో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా కీలక వ్యాఖ్యలు చేశాడు. విశ్రాంతి కారణంగా తొలి వన్డేకు దూరమైన బవూమా.. రెండో మ్యాచుకు ముందు మీడియాతో మాట్లాడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని చెప్పుకొచ్చాడు. తొలి వన్డేలో భారత్ గెలవడంలో ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్ల అనుభవం ఎంతో ఉపయోగపడిందని.. పేర్కొన్నాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మను ఉద్దేశించి మాట్లాడాడు.
"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాకతో టీమిండియా మరింత బలంగా మారింది. అయితే వీరిద్దరినీ ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. కొన్నిసార్లు పైచేయి సాధించాం. ఇలాంటి విషయాలు సిరీస్ను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి" అని టెంబా బవూమా వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ 2007లో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు బవూమా. రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో చదువుతున్నానని గుర్తు చేశాడు. కాగా తొలి టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్లో భారత్.. పాకిస్థాన్ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది. రాయ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు పోరు ప్రారంభం అవుతుంది. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన భారత్.. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో శతకంతో మెరిసిన విరాట్ కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక రెండో వన్డేలో భారత్.. రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
Latest News