ఏపీ రాజకీయాల్లో అరటి కాయ.. ఇప్పుడిదే ట్రెండింగ్
 

by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:31 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ విషయం చర్చనీయాంశమవుతుందో చెప్పడం.. చాలా కష్టం. చిన్న అవకాశం దొరికినా అధికార పార్టీని ఇరుకున పెట్టాలని విపక్షం.. విపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎదురు దాడి చేయాలని అధికార పక్షం.. ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు, ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. రాజకీయ చదరంగాన్ని రసవత్తరంగా మారుస్తుంటాయి . అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అరటి కాయ లేదా అరటి పండు.. చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం మీద విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అధికార కూటమి వాగ్భాణాలు, విమర్శలు, ప్రతివిమర్శలు సంధించుకుంటున్నాయి.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సొంత జిల్లాలో పర్యటించారు. పులివెందుల వెళ్లిన వైఎస్ జగన్ అక్కడ అరటి తోటలను పరిశీలించారు. అరటి ధర పతనం గురించి రైతులతో చర్చించారు. తమ హయాంలో అరటికి మంచి గిట్టుబాటు ధర ఉండేదన్న వైఎస్ జగన్.. కూటమి పాలనలో అరటికే కాదు.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో డిమాండ్ లేకపోతే ఇతర రాష్ట్రాలకు రైళ్లల్లో రవాణా చేయించిన ఘనత తమ పార్టీ సొంతమని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి సీఎం చంద్రబాబు అరటి రైతులను అసలు పట్టించుకోవడమే లేదని మండిపడ్డారు.


ఇక సోమవారం రోజున అరటి రైతుల సమస్యపై ఓ ట్వీట్ చేశారు వైఎస్ జగన్..భారతదేశ ప్రజలరా.. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.. ఇక్కడ ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. అగ్గిపెట్టెకన్నా, బిస్కెట్‌ కన్నా చవకగా ఇక్కడ అరటి పండ్లు దొరుకుతున్నాయి. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటాల వరకూ.. ఇలా ఏ పంటకూ ఏపీలో గిట్టుబాటు ధర లేదంటూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. రైతులు కష్టాలలో ఉంటే ఉచిత పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు. పెట్టుబడి సాయం వంటివేవీ లేవని విమర్శించారు. తమ పాలనలో టన్ను అరటి రూ.25000 ఉండేదన్న జగన్.. ఇప్పుడా పరిస్థితి లేదంటూ విమర్శలు చేశారు.


అయితే ఏపీలో కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమేనంటూ వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే అంటూ వైఎస్ జగన్ చెప్పడం పూర్తిగా సత్యదూరమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం తెలిపింది. అక్టోబర్ నెలలో ఈ సీజన్ ప్రారంభం కాగానే అరటి టన్ను రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకూ అమ్ముడైందని.. నవంబరు నెల మొదటి వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు రూ.7 వేలు, బీ గ్రేడ్ రూ.4 వేలు, సీ గ్రేడ్ రూ.3వేలకు అమ్ముడైనట్లు తెలిపింది. నవంబర్ నెల నాలుగో వారంలో ఏ గ్రేడు అరటి పండ్లు టన్ను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగాయని.. బీ గ్రేడు రూ.6 వేల నుంచి రూ 8 వేలకు, సీ గ్రేడు రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడైనట్లు తెలిపింది.


అనంతపురం, సత్యసాయి , కడప, నంద్యాల జిల్లాల్లో 34,000 హెక్టార్లలో అరటి పంట సాగవుతోందని తెలిపింది. కడప, అనంతపురం జిల్లాల నుంచి 700 మెట్రిక్ టన్నుల అరటిని ఉత్తర భారతదేశానికి తరలించి.. అక్కడ విక్రయించినట్లు తెలిపింది. గత వారం రోజులుగా అరటి మెట్రిక్ టన్నుకు రూ 2 వేల నుంచి రూ.4 వేలు పెరిగిందని.. అరటి రైతులకు రవాణా రాయితీ ఇవ్వాల్సిందిగా భారతీయ రైల్వేను కూడా కోరామని వెల్లడించింది. డిసెంబర్ రెండో వారం నుంచి అరటి ధర మరింత పెరిగే అవకాశం ఉందన్న ఏపీ ప్రభుత్వం.. రైతులను నిరాశకు గురిచేసేలా ప్రకటనలు చేయడం సరికాదని సూచించింది.

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM