|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 08:20 PM
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఘోర బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్లీపర్ కోచ్ బస్సులను తక్షణమే రోడ్లపై నుంచి పక్కన పెట్టేయాలని NHRC అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని.. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కర్నూలు, సౌదీ బస్సు ప్రమాదాల వంటి ఘటనల కారణంగా ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం ఎంత వరకు సురక్షితమనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది.
ప్రమాదాలకు కారణాలు ఇవే..!
ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న బస్సుల్లో 50 శాతానికి పైగా స్లీపర్ ఏసీ బస్సులే ఉంటున్నాయి. అయితే ట్రావెల్స్ సంస్థలు ఇష్టానుసారం బస్సులను మార్పులు చేర్పులు చేసి నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా చాలా బస్సుల్లో అగ్ని ప్రమాదాలను నియంత్రించే రక్షణ వ్యవస్థలు (ఫైర్ ఎక్స్టింగ్విషర్లు) ఉండటం లేదు. ట్రావెల్స్ సంస్థలు కూడా బస్సుల కండీషన్పై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టడం లేదు. ఇది చాలదన్నట్లుగా అత్యవసర ద్వారం ఉన్నచోట్ల కూడా సీట్లు ఏర్పాటు చేయడం లేదా అదనపు సీట్ల నిర్మాణంతో ప్రమాద సమయాల్లో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ప్రమాద సమయాల్లో ప్రయాణికులు వాటిని తీసేసి బయటకు వెళ్లలేకపోతున్నారు.
స్లీపర్ ఏసీ బస్సుల లోపలి భాగం ఇరుగ్గా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బయటకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటోంది. స్లీపర్ బస్సుల అడుగు భాగంలో సరకు నిల్వకు ఏర్పాట్లు ఉంటాయి. వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నాయి. కనీసం వారంతా వెంటనే బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించి, ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని NHRC ఆదేశించింది.