|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 07:44 PM
విద్యా సంవత్సరం మొదలైపోయింది.. విద్యార్థులు అందరూ స్కూళ్లు, కాలేజీలకు బయల్దేరిపోయారు. చిన్నారుల స్కూలు అడ్మిషన్ల కోసం వారి తల్లిదండ్రులు.. ఏ పాఠశాల మంచిదా అనే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ పిల్లలను స్కూళ్లల్లో జాయిన్ చేసేశారు. మరికొంతమంది ఇంకా పాఠశాల అన్వేషణలో ఉన్నారు. చాలా పాఠశాలల్లో అడ్మిషన్స్ క్లోజ్ అంటూ బోర్డులు కూడా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు చూస్తామని మీరెప్పుడైనా ఊహించారా..
సర్కారీ బడులంటే పెచ్చులూడిన గదులు, విరిగిపోయిన బల్లలు, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ నెల్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను చూస్తే మాత్రం మీరు, మీ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం జనాలు క్యూ కడుతున్నారు. చివరకు పాఠశాల యాజమాన్యం అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది. అదే నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ . వీఆర్ హైస్కూల్లో తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ తల్లిదండ్రులు తాపత్రయపడుతుండగా.. సీట్లు ఫుల్ కావటంతో ఇలా అడ్మిషన్స్ క్లోజ్డ్ అంటూ బోర్డు పెట్టారు.
నెల్లూరు వీఆర్ హైస్కూల్.. గతంలో మూతపడింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వీఆర్ హైస్కూలుకు మంచి రోజులు వచ్చాయి. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వీఆర్ హైస్కూలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ స్కూలును తిరిగి ప్రారంభమయ్యేలా చూశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో వీఆర్ హైస్కూల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించారు. రూ.15 కోట్లతో వీఆర్ హైస్కూల్ రూపురేఖలే మార్చివేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు పోటీపడ్డారు. ఈ ఏడాది వీఆర్ హైస్కూల్లో వేయి మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు.
జూన్ 23 నుంచి వీఆర్ మున్సిపల్ హైస్కూల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ మూడు సెక్షన్లు చొప్పున విద్యార్థులను విభజించారు. మరోవైపు వీఆర్ మున్సిపల్ హైస్కూల్లోనే మంత్రి నారాయణ చదువుకోవటం విశేషం. తనకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలను అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ కుమార్తెలు.. పాఠశాల ఆధునికీకరణలో భాగం పంచుకున్నారు.
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫామ్తో పాటుగా నారాయణ విద్యాసంస్థలు మరో 4 జతల యూనిఫామ్స్ అందించనున్నాయి. అలాగే వీఆర్ హైస్కూలుకు దగ్గరగా ఉన్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, దూర ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు వీఆర్ హైస్కూల్ వద్ద అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టడంపై ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పాఠశాలను అభివృద్ధి చేసినందుకు మంత్రి నారాయణను లోకేష్ అభినందించారు. వైసీపీ ప్రభుత్వం నిర్వహించలేక మూసివేసిన వీఆర్ హైస్కూల్లో.. ప్రస్తుతం అడ్మిషన్స్ ముగిశాయని బోర్డు పెట్టారంటే.. అదే మార్పునకు నిదర్శనమంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Latest News