|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:37 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. రీసెంట్ గా పుష్ప 2 సినిమాలోని డైలాగ్ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని.. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని హెచ్చరించారు. అలానే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని.. ఇప్పటికే పోలీసులకు తగిన దిశానిర్దేశం ఇచ్చామని అన్నారు. జగన్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో ప్రజలు గుర్తించాలని పవన్ పేర్కొన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమేనని.. ఇది ఎవ్వరూ మరచిపోవద్దని పవన్ అన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టమని.. అలాంటి వారిపై కచ్చితంగా రౌడీ షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. కాగా అంతకు ముందు జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ శ్రేణులు పుష్ప సినిమాలోని డైలాగుతో ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ ఘటనపై స్పందించిన మాజీ సీఎం.. అది సినిమా డైలాగ్ అని.. సినిమా డైలాగ్ ల విషయంలో కూడా ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సబబు కాదన్నారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పలువురు కూటమి మంత్రులు స్పందించి తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కూడా రియాక్ట్ అవ్వడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పట్ల వైసీపీ నేతలు సైతం వాగ్బాణాలు సందిస్తున్నారు. గతంలో వైసీపీ కొ***** లారా తేల్చుకుందాం అంటూ పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం తన సినిమా డైలాగ్ లను చెప్పారని.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్లు మీద పడుకున్న విషయాన్ని మర్చిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News