|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:56 PM
ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాడీలను ఏకంచేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనక నడవమని జగన్ చెప్తున్నారని.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారని పయ్యావుల చెప్పారు. 'అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్లు చేశారు. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారు. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణుక్యుడు బందిపోటులను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు.. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు. గంజాయి, బ్లేడ్ బాచ్లను జగన్ ప్రోత్సాహిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి, రప్పా..రప్పా నరుకుతాం అంటున్నారు.' అని కేశవ్ తూర్పారబట్టారు. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో తలెత్తిన పరిణామాలపై మంత్రి పయ్యావుల అమరావతిలో మీడియాతో మాట్లాడారు. జగన్ కోసం వైసీపీ నేతలు, వాళ్లు తయారు చేసిన రౌడీలు పెట్టిన కటౌట్లు ప్రజల్ని భయపెట్టేలా ఉన్నాయన్నారు. నక్సలైట్లను చూసి కలబడి నిలబడిన నాయకుడు చంద్రబాబైతే, రౌడీలను సమీకరించి, కొత్త రౌడీలను తయారు చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భయపెట్టాలనుకునే వ్యక్తి జగన్ అని పయ్యావుల అన్నారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శనా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే పరామర్శించలేదే అని పయ్యావుల నిలదీశారు. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని కూడా పయ్యావుల చురకలంటించారు.
Latest News