![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:27 PM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.తమను ఈ కేసులో తప్పుగా ఇరికించారని ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. తమపై దాఖలైన కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఆర్సీబీతో పాటు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా తమపై నమోదైన కేసుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఐపీఎల్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం చిన్నస్వామి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట పెను విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దుర్ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సహా తొక్కిసలాటకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Latest News