|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:42 PM
పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయం వద్ద ఈరోజు మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'ఆపరేషన్ బ్లూ స్టార్' 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఖలిస్థాన్ అనుకూల నినాదాలు మిన్నంటాయి. శిరోమణి అకాలీదళ్ (మాన్ వర్గం) నేత సిమ్రన్జిత్ సింగ్ మాన్ స్వర్ణ దేవాలయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఆపరేషన్ బ్లూ స్టార్ 41వ వార్షికోత్సవ కార్యక్రమాలు ఈరోజు స్వర్ణ దేవాలయంలో జరిగాయి. ఇదే రోజున, 1984 నాటి సైనిక చర్యలో మరణించిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే వర్ధంతి కూడా కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్ (మాన్ వర్గం) నాయకుడు సిమ్రన్జిత్ సింగ్ మాన్ స్వర్ణ దేవాలయ ప్రాంగణానికి చేరుకోగానే, ఆయన మద్దతుదారులు 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.నిన్న దల్ ఖల్సా అనే సంస్థ ఆధ్వర్యంలో అమృత్సర్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. బుర్జ్ అకాలీ ఫూలా సింగ్ ప్రాంతం నుంచి స్వర్ణ దేవాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో యువకులు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా ఖలిస్థాన్ అనుకూల నినాదాలు మార్మోగాయి. ఈ ప్రదర్శనలో సిమ్రన్జిత్ సింగ్ మాన్తో పాటు పంథ్ సేవక్ జథా నాయకుడు దల్జీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఆపరేషన్ బ్లూ స్టార్కు నిరసనగా శుక్రవారం అమృత్సర్లో బంద్కు కూడా దల్ ఖల్సా పిలుపునిచ్చింది.
Latest News