![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:10 PM
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో ఇవాళ(శనివారం) పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని విచారణ పేరుతో ఆస్పత్రి నుంచి పోలీస్స్టేషన్కు తరలించడం సరికాదని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని.విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వంశీకి వైద్యులు టెస్టులు రాయనీయకుండా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ నిబంధనలను తుంగలో తొక్కి.. దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మాట్లాడలేని, నడవలేని స్థితిలో తాను ఉన్నానని వంశీ చెబితే ఓఆర్ఎస్ తాగమని చెబుతారా అని ప్రశ్నించారు. వంశీకి చాలా నీరసంగా ఉందని చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు అందుబాటులో లేకుండా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడును గతంలో అరెస్టు చేసిన సమయంలో తనకు పైల్స్ అంటూ డ్రామాలు ఆడారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు చేరి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో వంశీకి ఇబ్బందులు ఉన్నాయని.. అయినా ఎందుకు చికిత్స అందించడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఐ భాస్కర్రావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
Latest News