![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:45 PM
వేసవి దృష్ట్యా పెరుగుతున్న నీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వేసవి తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్కు 4 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు కేఆర్ఎంబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నీటి వినియోగానికి సంబంధించి ప్రాజెక్టులలో నీటిమట్టాలపై కూడా బోర్డు స్పష్టతనిచ్చింది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అనుమతించింది.ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాల్వ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నీటి విడుదలతో వేసవిలో తాగునీటి సమస్య కొంతమేర తీరుతుందని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ విషయంలో కూడా బోర్డు కీలకమైన సూచన చేసింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం జలాశయంలో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
Latest News