వాషింగ్టన్: భారతదేశంతో సియాటెల్ టెక్నాలజీ సమాజం కలిగి ఉన్న బలమైన సంబంధాలను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ మరియు సీఈఓ సత్య నాదెళ్ల ప్రశంసించారు. సియాటెల్లోని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ‘ఐడియాస్4ఇండియా: ఇండియన్ అమెరికన్ టెక్ సీఈఓస్ ఫోరమ్’ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక సర్వసాధారణ సాంకేతికత అని, దీని ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా, కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్, అమెజాన్, బోయింగ్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, ఇంటెల్ వంటి దాదాపు 40కి పైగా ప్రముఖ కంపెనీల భారత సంతతి సీఈఓలు పాల్గొన్నారు. భారత్-అమెరికా టెక్నాలజీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు మరియు ఏరోస్పేస్ రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ 2026 నుండి 2029 వరకు భారతదేశంలో క్లౌడ్, ఏఐ మౌలిక సదుపాయాల కోసం 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని అధికారులు తెలిపారు.