సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: అనీష్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఇట్లు అర్జున'. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తుండగా, తమన్ స్వరాలు అందిస్తున్నారు. హైదరాబాద్లోని ఒక వేదికపై ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో యంగ్ లేడీ డైరెక్టర్ మానసా శర్మ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా వేదికపై ఒక భావోద్వేగ వాతావరణాన్ని నింపాయి.
దర్శకుడు మహేష్ ఉప్పాల గురించి మాట్లాడే సమయంలో మానసా శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను, మహేష్ పదో తరగతి నుంచే క్లాస్మేట్స్ మరియు మంచి స్నేహితులమని, అప్పుడే తామిద్దరం భవిష్యత్తులో ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని కలలు కన్నామని తెలిపారు. ఆ కల నిజమై ఈ రోజు తాను 'రాకాస' చిత్రంతో దర్శకురాలిగా, మహేష్ 'ఇట్లు అర్జున'తో దర్శకుడిగా పరిశ్రమలో నిలబడడం తన జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణమని ఆమె ఆనందబాష్పాలు రాల్చారు.
తన సొంత చిత్రం వేడుకలో కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదని, స్నేహితుడి ప్రయాణాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నానని మానస పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి కథను సైతం మహేష్తో కలిసి తాను ఇష్టపడి రాశానని స్పష్టం చేశారు. మూగవాడైన అర్జున పాత్రలో అనీష్ నటన అద్భుతంగా ఉందని, ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.