చక్కెర నిల్వ పరిమితి 30 రోజులకు పెంపు!
న్యూఢిల్లీ: రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని భారీ చక్కెర వినియోగదారులకు (నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వాడే పరిశ్రమలు) కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వీరి చక్కెర నిల్వ పరిమితిని 15 రోజుల నుండి 30 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, అదనంగా ఉంచే 15 రోజుల నిల్వలను తప్పనిసరిగా 'అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్' (AAS), 'టారిఫ్ రేట్ కోటా' (TRQ) కింద దిగుమతి చేసుకున్న చక్కెర నుండే సేకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఓపెన్ మార్కెట్ కొనుగోళ్లకు పాత 15 రోజుల నిల్వ పరిమితి నిబంధనే వర్తిస్తుంది.
అంతేకాకుండా, భారీ వినియోగదారులు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం 'ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ' ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దిగుమతి చేసుకున్న చక్కెర వినియోగం వల్ల దేశీయ సరఫరాపై ప్రభావం పడకుండా పారిశ్రామిక అవసరాలు నిరంతరాయంగా సాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
గరిష్ట స్థాయిలతో పోలిస్తే చిల్లర మార్కెట్లో చక్కెర ధరలు 10% మేర తగ్గి, ఆగస్టులో ఉన్న ₹65 నుండి ప్రస్తుతం ₹58.50కి చేరాయని ప్రభుత్వం తెలిపింది. అయితే మిల్లుల వద్ద (Ex-mill) చక్కెర ధరలు ఏకంగా 25% తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనం వినియోగదారులకు ఇంకా పూర్తిగా చేరలేదని గుర్తిస్తూ... వెంటనే ఆ తగ్గింపును చిల్లర ధరలలో ప్రతిబింబించేలా చూడాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, అక్టోబర్ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్ నుండి చెరకు రైతులకు 'న్యాయమైన మరియు లాభదాయక ధర' (FRP) క్వింటాలుకు ₹365 లభిస్తుందని వెల్లడించింది.