న్యూఢిల్లీ: మధ్యప్రాచ్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వంటి ప్రతికూల ప్రపంచ పరిస్థితులను భారత ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా తట్టుకుందని ప్రశంసిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్స్ గుడ్ న్యూస్ తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ఉన్న 6 శాతం నుండి గణనీయంగా 7 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
భారతదేశం యొక్క 'Baa3' సావరిన్ రేటింగ్పై నిర్వహించిన సాధారణ సమీక్ష అనంతరం మూడీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. పటిష్టమైన ప్రైవేట్ వినియోగం, కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం, పుంజుకున్న ప్రైవేట్ పెట్టుబడులు మరియు సేవా రంగంలో స్థిరమైన వృద్ధి కారణంగా 2026 క్యాలెండర్ సంవత్సరం తొలి ఆరు నెలల్లో భారత్ వృద్ధి రేటు 8.2 శాతానికి చేరిందని పేర్కొంది.
అయితే, భవిష్యత్తులో కొన్ని ఆర్థిక ప్రమాదాలు పొంచి ఉన్నాయని మూడీస్ హెచ్చరించింది. మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమైతే చమురు ధరలు పెరిగి వార్షిక ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, అలాగే 'ఎల్ నినో' ప్రభావంతో ఆహార ధరల పైఒత్తిడి కలిగి ప్రైవేట్ వినియోగంపై ప్రభావం పడొచ్చని తెలిపింది. వీటితో పాటు అధిక రుణ భారం, వడ్డీ చెల్లింపు వ్యయాల కారణంగా రుణ తగ్గింపు ప్రక్రియ నెమ్మదిస్తుందని పేర్కొన్నప్పటికీ... భారత్ విదేశీ మారక నిల్వలు, బలమైన దేశీయ డిమాండ్ సురక్షిత రక్షణ కవచాలుగా నిలుస్తాయని వెల్లడించింది.
ఇటీవలే జపాన్కు చెందిన జేసీఆర్ (JCR) ఏజెన్సీ 35 ఏళ్ల తర్వాత భారత్ రేటింగ్ను 'A-' కి అప్గ్రేడ్ చేయగా, ఎస్&పి (S&P), ఫిచ్ ఏజెన్సీలు కూడా భారత్ పెట్టుబడి-గ్రేడ్ రేటింగ్ను ధృవీకరించిన సంగతి తెలిసిందే. కాగా, రికార్డు స్థాయిలో 2027 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ ఏకంగా 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.